ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది కరోనా వైరస్ కు గురి అయినట్టుగా చెబుతూ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు ఈ మహమ్మారి గురించి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మాట్లాడారు. కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత వేగంగా వ్యాపిస్తోందని ఆయన చెప్పడం గమనార్హం.
కరోనా లక్షమందికి చేరడానికి 67 రోజుల పాటు పట్టింది, అయితే ఆ తర్వాత 11 రోజుల్లో రెండు లక్షల మందికి అంటుకుంది, ఆ నాలుగు రోజుల్లోనే మూడు లక్షల మంది కరోనా ఇన్ ఫెక్ట్ అయ్యారు.. అని ఆయన విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా కరోనా విజృంభణ వేగంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో కరోనా గురించి కూడా ఆయన కామెంట్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. జనసంఖ్య భారీగా ఉండే ఆ దేశంలో ఎక్కువ కాలం పాటు కరోనా ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇండియా ఇది వరకూ కొన్ని అంటు వ్యాధులను, పోలియోను సమర్థవంతంగా ఎదుర్కొందని, ఇప్పుడు కూడా అదే తీరున నిలదొక్కుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారాయన.
మరోవైపు లాక్ డౌన్ అయినప్పటికీ ఫ్రాన్స్ వంటి దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని అంటున్నాయి నంబర్లు. ఇప్పటికే ఆ దేశం లాక్ డౌన్ అయ్యింది. అయినా సోమవారం ఒక్క రోజే 186 మంది కరోనా బాధితులు చనిపోయారట. మొత్తంగా 860 మంది వరకూ మరణించారట. సోమవారం కూడా కొత్తగా పలు కరోనా కేసులు రిజిస్టర్ అయినట్టుగా సమాచారం. దాదాపు 20 వేల మందికి అక్కడ కరోనా సోకినట్టుగా గుర్తించారు.
వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉందని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖా మంత్రి ప్రకటించారు. ఇవి నంబర్ల అంటే నంబర్లు కాదు, ప్రాణాలు అనే విషయాన్ని గుర్తించాలి. కరోనా నివారణకు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలో ఈ నంబర్లు చాటి చెబుతున్నాయి.