కూతురంటే ప్రేమకు ప్రతీక అంటారు. కంటే కూతుర్నే కనాలని చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఆస్తిపైనే తప్ప, అమ్మానాన్నలపై ప్రేమ లేదని ఓ కూతురు నిరూపించింది. దీంతో ఆ కూతురిపై సీనియర్ సిటిజెన్ చట్టం-2007 కింద కేసు నమోదైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో బ్రహ్మపురం 21వ వార్డులో బ్రహ్మానందం (70) తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉంటున్న ఆ దంపతుల ఆలనాపాలనా చూసుకుంటానని ఏలూరులో ఉంటున్న కుమార్తె మల్లూరి లక్ష్మి భరోసా ఇచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ప్రతి తల్లిదండ్రికి తమ కూతురు లాంటి బిడ్డ ఉంటే జీవిత చరమాంకంలో బాధ పడాల్సిన అవసరమే రాదని అనుకోవడంతో పాటు ఇదే విషయాన్ని పది మందితో చెప్పుకున్నారు. బిడ్డ ప్రేమకు మైమరిచిన ఆ తల్లిదండ్రులు తమ పేరుతో ఉన్న 473 చదరపు గజాల స్థలాన్ని కుమార్తె పేరుతో రాసిచ్చారు.
ఎప్పుడైతే ఆస్తి తన సొంతమైందో, ఆ క్షణం నుంచి తల్లిదండ్రుల యోగక్షేమాలను బిడ్డ పట్టించుకోవడం మానేసింది. కూతురి చేతిలో మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు లబోదిబోమంటూ పోలీస్స్టేషన్కు వెళ్లారు.
తండ్రి బ్రహ్మానందం ఫిర్యాదు మేరకు కూతురిపై సీనియర్ సిటిజెన్ చట్టం-2007 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ చట్టం కింద పెడనలో కేసు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పడం గమనార్హం.