డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటుడు, బిగ్బాస్ ఫేం తనీష్కు నోటీసులు అందాయి. బిగ్బాస్ రియాల్టీ షో సీజన్-2లో తనీష్ పాల్గొన్నారు. పలు సినిమాల్లో కూడా నటించిన తనీష్ …బిగ్బాస్ రియాల్టీ షోతో ప్రేక్షకాదరణ పొందారు. బిగ్బాస్ తర్వాత పలు షోలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు తనీష్తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత కూడా ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్లో 2017లో డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు తనీష్ హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన బెంగళూరులో విచారణకు హాజరు కానుండడం గమనార్హం. బెంగళూరు అధికారులు మొదట ఇద్దరు విదేశీ యులను అరెస్ట్ చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కి మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి.
మస్తాన్ను విచారించగా సినీ నిర్మాత శంకరగౌడ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన తన కార్యాలయంలో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా తనీష్ పేరు తెరపైకి వచ్చింది. విచారణలో తనీష్ ఏం చెబుతారనే విషయమై ఉత్కంఠ నెలకుంది.