‘అయ్యా అవసరం లో ఉన్నాను కాస్త ఆదుకోండి…’ అని అడగడం ఒక రకం…. అది అర్థింపు అవుతుంది. అలా కాకుండా సంకుచిత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం… చేసిన పాపాల నుంచి తప్పించుకోవడం కోసం బతిమాలడం మొదలెడితే గనుక… అది దేబిరింపు అవుతుంది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఈ రెండో కోవలోకి చెందిన ప్రయత్నం చేస్తోంది. ఐదేళ్ల ప్రభుత్వ పాలన కాలంలో…. తాము చేసిన పాపాలు కాలనాగులు గా మారి కాటు వేయకుండా కాపాడాలని హైకోర్టును అభ్యర్థిస్తోంది.
ఐదేళ్ళ పాటు సాగిన తెలుగుదేశం పార్టీ అరాచక పరిపాలనపై, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మంత్రి వర్గ ఉప సంఘం ద్వారా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, అమరావతి ప్రాంతంలో భూభాగోతాలు తదితర అన్ని వ్యవహారాలపై మంత్రివర్గ ఉపసంఘం విచారణ జరిపింది. వారు అందించిన నివేదిక ఆధారంగా… గత ప్రభుత్వ పాలన, విధాన నిర్ణయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చార్జిషీట్ లు కూడా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని అధికారాలతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ ప్రారంభించింది కూడా!
అయితే సిటీ ఏర్పాటు వంటి, అనూహ్య నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనాటి నుంచి మధన పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాన్ని వేధించడానికి సిట్ ఏర్పాటు చేశారు అనేక దఫాలుగా ఆరోపణలు గుప్పించారు. నన్ను ఇబ్బంది పెట్టడానికే సిట్ ఏర్పాటు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు కూడా అనేక రకాలుగా రంకెలు వేశారు.
అయితే ఇప్పటికే పని మొదలు పెట్టిన సిట్ దర్యాప్తులో అనేక వ్యవహారాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. కంగారు పడిన తెలుగుదేశం నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు నిలువరించాలని ఆరాటపడుతున్నారు. మంత్రివర్గ ఉప సంఘం, సిటీ ఏర్పాటు గురించిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తొలుత న్యాయవిచారణ అన్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అసలు ఆ జీవో రద్దు చేయాలని ఆరాటపడటం ఏమిటో అర్థం కాని సంగతి. పాత ప్రభుత్వ విధాన నిర్ణయాలను సమీక్షించే ఆలోచనకు చట్టబద్ధత లేదని తెలుగుదేశానికి… ఉప సంఘం విధించిన ఇన్ని నెలల తర్వాత గుర్తు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ జీవోలను చూసి పచ్చ నాయకులు ఎంత భయపడుతున్నారో గమనిస్తే… వారి పాపాలు అంతగా బయటపడబోతున్నాయని అర్థమవుతుంది.