మొత్తానికి మరోసారి క్లారిటీ వచ్చేసింది. తిరుపతి ఉప ఎన్నిక బరిలో జనసేనకు అవకాశం లేదు. కేవలం ఈ పని మీద తన సచివుడు మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చినా ఫలితం లేకపోయింది.
తిరుపతి బరిలో జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి రంగంలోకి దిగుతారని ఆ పార్టీ నేత మురళీ ధరన్ ప్రకటించారు. దీంతో ఇక జనసైనికుల ఉత్సాహానికి అడ్డుకట్ట పడిపోయినట్లే.
తిరుపతి నియోజక వర్గం పరిథిలో తమకు బలం వుందని, అందువల్ల ఎంపీ పోటీ అవకాశం తమకు వదిలేయాలని పవన్ కళ్యాణ్ కోరినా ఫలితం లేకపోయింది.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా వాస్తవానికి జనసేన భాజపా కలిసి పోటీ చేసింది తక్కువ. జనసేన పోటీలో లేని ప్రతి చోటా చాలా వరకు తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చారు జనసైనికులు.
మరి ఇప్పుడు తిరుపతిలో భాజపాతో కలిసి పోటీ చేసినా, జనసైనికులు ఆ పార్టీ వెంటే వుంటారో? తెదేపాకు తెరవెనుక మద్దతు ఇస్తారో వేచి చూడాలి.