టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు విశాఖ స్లీట్ ప్లాంట్ నిరసన సెగ తగిలింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 30 మందికి పైబడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం ప్రయివేటీకరించాలని నిర్ణయించడంపై ఏపీ ప్రజానీకం భగ్గుమంటోంది.
ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖ వెళ్లిన మంచు విష్ణుకు శుక్రవారం నిరసన సెగ తగిలింది. విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద హీరో విష్ణును నిరసనకారులు అడ్డుకున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమా నికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని విష్ణుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిరసన కారులుల వినతి పత్రం అందజేశారు. విశాఖకు ఏ సినీ ప్రముఖులు వచ్చినా ఇలాగే అడ్డుకుని తమ ఆవేదనను వారికి వివరించి, మద్దతు కోరుతామన్నారు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ సంస్థ నష్టాల్లో ఉందని ప్రయివేటీకరణ చేయాలనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని తప్పు పట్టారు. ప్రయివేట్ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, అదే పని ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు. సినీ పెద్దల నిర్ణయం మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతు ఉంటుందన్నారు.