నిజానికి జేసీ దివాకర్ రెడ్డి గత పాతికేళ్లలో సాగించిన వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టలేదు ఇంత వరకూ! గత పదేళ్లలో జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడినా, దివాకర్ రెడ్డి కుటుంబీకులను జగన్ అస్సలు పట్టించుకుంటున్నట్టుగా లేడు! ఒకవేళ పట్టించుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి!
ఇప్పటి వరకూ దివాకర్ రెడ్డి దందాలకు అడ్డుపడింది కోర్టు, రవాణా శాఖ అధికారులు మాత్రమే! ఇష్టానుసారం ట్రావెల్ బస్సులను, ఆఖరికి అధికారం కోల్పోయి ఏడాది కావొస్తున్నా ఇంకా రాంగ్ పర్మిట్లతో బస్సులను నడిపించే సాహసం చేస్తున్నారు దివాకర్ ట్రావెల్స్ వాళ్లు. ఫలితంగా ఆ బస్సులు సీజ్ అవుతున్నాయి. ఇక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ భూములు తీసుకుని, వాటిల్లో మైనింగ్ చేసుకోవడానికి చెక్ చెప్పింది న్యాయస్థానం మాత్రమే! ఇంకా అక్కడ చేసిన అక్రమ మైనింగ్ పై ఫైన్ పడలేదు, అది కూడా పూర్తయితే దివాకర్ రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆయన వీరాభిమానులకు కూడా అంతుబట్టని వ్యవహారంగా మారినట్టుగా ఉంది.
బస్సులు ఆపేసరికి, సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిట్ ను రద్దు చేసే సరకే దివాకర్ రెడ్డి తాము మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు, పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ ఉండదు.. అంటూ అస్త్ర సన్యాసాన్ని ప్రకటించారు. పోటీ చేస్తే తమపై కొత్త కేసులు వస్తాయని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. డబ్బులు పంచకుండా ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యం కాదని, అందుకే ఈ సన్యాసం అని జేసీ సీనియర్ చెప్పుకొచ్చారు.
తాడిపత్రి నియోజకవర్గం వరకూ తామ అనుచరగణం అస్సలు పోటీలో ఉండదని దివాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ మాట మీద ఎంత వరకూ నిలబడతారో కానీ, ఆయన అస్త్ర సన్యాస ప్రకటనకూ, గత పదేళ్లలో మాట్లాడిన మాటలకూ ఏమైనా పొంతన ఉందా? అనేది ఆయన అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది!