వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా గతం తాలూకూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారాయన.
తండ్రి వైఎస్కు మారుపేరుగా నిలిచిన విలువలు, విశ్వసనీయతలే పార్టీ సిద్ధాంతాలుగా వైఎస్సార్సీపీ అవతరించిన విషయాన్ని ఆయన మననం చేసుకున్నారు. జగన్ భావోద్వేగ ట్వీట్ సాగిన తీరును తెలుసుకుందాం. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.
విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్సీపీ పురుడు పోసుకున్నట్టు ఆయన తెలిపారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ఆయన ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినం సందర్భంగా గత పదేళ్ల ప్రస్థానాన్ని జగన్ గుర్తు చేసుకోవడం గమనార్హం. తన వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులకు కేవలం కృతజ్ఞతలతో సరిపెట్టకుండా నమ్మిన వాళ్లకు ఇంకా న్యాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.