పార్టీల పేర్లు వేరే తప్ప, టికెట్ల కేటాయింపు విషయానికి వచ్చే సరికి అన్నీ అంతే అని ప్రముఖ సీనియర్ హీరోయిన్లు కుష్బూ, గౌతమికి అనుభవాలు తెలుసొచ్చేలా చేశాయి. రాజకీయాల్లో అసలే మహిళల పాత్ర తక్కువ.
రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లను కూడా ప్రోత్సహించకపోతే, ఇక వాళ్లకు భవిష్యత్ పట్ల ఎలా నమ్మకం కలుగుతుంది? ఎంతో నమ్మకంగా గత కొన్ని నెలలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కుష్బూ, గౌతమిలకు బీజేపీ చివరి నిమిషంలో రిక్త హస్తాలు చూపడం చర్చనీయాంశమైంది. పొత్తులో భాగంగా సీట్లు కేటాయించలేక పోతున్నట్టు చెప్పడంతో ఆ మహిళా నేతలిద్దరూ తీవ్ర నిరాశ,నిస్పృహలకు లోనయ్యారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ నుంచి సినీ నటి కుష్బూ బీజేపీలో చేరారు. కుష్బూ కంటే ముందు నుంచి గౌతమి బీజేపీలో ఉన్నారు. యాక్టీవ్గా తిరుగుతూ పార్టీ బలోపేతానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విరుదునగర్ జిల్లా రాజపాళయం అసెంబ్లీ టికెట్ను గౌతమి, చేపాక్కం–ట్రిప్లికేన్ టికెట్ను కుష్బూ ఆశించారు. ఎందుకంటే ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్లుగా బీజేపీ వారిని నియమించింది. దీంతో కొంత కాలంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. తాజాగా ఎన్నికలు సమీపించే సమయానికి నిరాశ తప్పలేదు.
అధికార పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేపాక్కం–ట్రిప్లికేన్, రాజపాళయంలలో అన్నా డీఎంకే అభ్యర్థులే బరిలో నిలవనున్నట్టు ప్రకటించారు. దీంతో కుష్బూ, గౌతమి ఆశలు అడియాసలయ్యాయి. ఇంతకాలం ఆ నియోజకవర్గాల్లో తమ శ్రమంతా వృథా అయ్యిందనే ఆవేదన వాళ్లిద్దరిలో కనిపిస్తోంది. ఐదు నెలలుగా ప్రతి ఇంట్లోనూ తనను ఓ బిడ్డగా, సోదరిగా చూసుకున్న రాజపాళయం ప్రజలకు కృతజ్ఞతలని గౌతమి ట్వీట్ చేయడం గమనార్హం.