శ్రీవారి సొత్తు కారుచవకే.. కానీ, గతిలేదు!

దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో అత్యద్భుతమైన అతిథిగృహాల సముదాయాన్ని నిర్మించారు. చిన్నదేమీ కాదు. 80 ఏసీ గదులు, 120 నాన్ ఏసీ గదులు. కొత్త నిర్మాణం. కానీ కొన్ని సంవత్సరాలుగా కనీసం ప్రారంభోత్సవానికే…

దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో అత్యద్భుతమైన అతిథిగృహాల సముదాయాన్ని నిర్మించారు. చిన్నదేమీ కాదు. 80 ఏసీ గదులు, 120 నాన్ ఏసీ గదులు. కొత్త నిర్మాణం. కానీ కొన్ని సంవత్సరాలుగా కనీసం ప్రారంభోత్సవానికే నోచుకోకుండా ఎదురుచూసింది. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కొబ్బరికాయైతే కొట్టారు గానీ.. వినియోగంలోకి తేవడానికి చాలా కాలమే నిరీక్షించాల్సి వచ్చింది. చిట్టచివరికి కారుచవకే ధరకే అయినప్పటికీ.. వేరే గత్యంతరం లేక ఏపీ టూరిజం వారికి నిర్వహణ అప్పగించారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల వారు తిరుచానూరు సమీపంలో ఒక మంచి అతిథిభవనాల సముదాయం నిర్మించారు. భవనం అందంగానే, సౌకర్యంగానే ఉంటుంది గానీ.. దాని నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే సరైనది కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. మద్రాసునుంచి తిరుపతి వెళ్లే బైపాస్ రోడ్డుకు పక్కగా.. తిరుచానూరుకు సమీపంలోనే ఈ భవనం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతానికంతటికీ అదొక్కటే భవనం. చుట్టుపక్కల ఏమీ లేవు.

దీంతో అతిథిభవనం పూర్తయి చాన్నాళ్లయినప్పటికీ వినియోగంలోకి రాలేదు. కనీసం ప్రారంభోత్సవం కూడా జరగలేదు. చాలా భారీ వ్యయంతో టీటీడీ నిర్మించింది. కనీసం ప్రారంభోత్సవం కూడా ఒకపట్టాన జరగలేదు. చివరికి వైవీసుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక ప్రారంభించారు. దాని నిర్వహణను ప్రెవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నించారు గానీ.. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిఎద్దడి కూడా అందుకు కారణమైంది.

చాలా ప్రయత్నాల తర్వాత తాజాగా ఏపీ టూరిజం వారికి లీజుకిచ్చారు. ఏడాదికి లీజు కోటిరూపాయలు. అంటే నెలకు సుమారు 8.3 లక్షలు మాత్రమే అవుతుంది. నిజానికి ఇది తక్కువ అద్దె అని కొందరి అభిప్రాయం. కానీ.. జనావాసాలకు దూరంగా ఉండడం, నీటిఎద్దడి ఉండడంతో టీటీడీకి వేరే గత్యంతరం లేకుండా పోయింది. అనేక ప్రాంతాలనుంచి తిరుమల దైవదర్శనార్థం ప్రతిరోజూ తీసుకువచ్చే టూరిస్టులకు స్థానికంగా వసతి సదుపాయం కల్పించడానికి టూరిజం వారు దీనిని వాడుకుంటారు. ఈభవనంలో ఉండే దుకాణ సముదాయాలు, ఇతర ఏర్పాట్లను మాత్రం టీటీడీనే నిర్వహించనుంది.

బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు