తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగా నామినేషన్లు వేయగల నియోజకవర్గాల విషయంలో కూడా జాతీయ పార్టీలు పూర్తిగా వెనుకబడ్డాయి. ద్రవిడ పార్టీలు ముష్టిగా ఎన్ని సీట్లు వేస్తే అన్నింట పోటీ చేయడమే ఈ జాతీయ పార్టీలకు గగనంగా మారింది. ఈ క్రమంలో సీట్ల బేరం అంటూ బోలెడంత చర్చల తర్వాత.. కాంగ్రెస్, బీజేపీలు అక్కడ పోటీ చేసే సీట్ల పై క్లారిటీ వచ్చింది.
డీఎంకే దయ మీద కాంగ్రెస్, అన్నాడీఎంకే దయమీద బీజేపీలో తాము పోటీ చేసే సీట్ల విషయంలో క్లారిటీ తెచ్చుకున్నాయి. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీనే కాస్త బెటర్. కాంగ్రెస్ పార్టీ 25 సీట్లకు పోటీ చేస్తూ ఉంది. అన్నాడీఎంకేతో బోలెడంత చర్చల తర్వాత 20 స్థానాల్లో బీజేపీ నామినేషన్లు వేయగలిగేలా ఉంది.
ఇలా రెండు జాతీయ పార్టీలూ అత్యంత పరిమిత స్థాయి సీట్లకు పోటీ చేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేల ఓటు బ్యాంకు వీటికి ఏమైనా కలిసి వస్తే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.
ఇక అన్నాడీఎంకే అత్యధికంగా 177 సీట్లకు పోటీ చేస్తూ ఉండగా, డీఎంకే 173 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో ఉంది. అన్నాడీఎంకే గతంలో కొన్ని సార్లు సోలోగా ఎన్నికలకు వెళ్లి నెగ్గుకు వచ్చిన చరిత్ర ఉంది. డీఎంకే ఎప్పుడూ పొత్తుల మీదే ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ సారి అన్నాడీఎంకే కూడా పొత్తులకు చాలా ప్రాధాన్యతను ఇవ్వకతప్పలేదు.
ప్రత్యేకించి బీజేపీ ఆ 20 సీట్లను కూడా డిమాండ్ చేసి మరీ సాధించుకుంది. జయలలిత లేని లోటేమిటో అన్నాడీఎంకేకు ఎన్నికల ముందే పూర్తి స్పష్టత వస్తోంది. మరి ఫలితాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో!