ఈ పెళ్లి క‌రోనా స్పెష‌ల్‌

ఆరోగ్యం బాగున్న వాళ్లే క‌రోనా స‌మ‌యంలో పెళ్లి చేసుకోవ‌డానికి ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నారు. కొంద‌రైతే బంధు మిత్రాదులెవ‌రూ లేకుండా పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్టం లేక వాయిదా వేసుకుంటున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే క‌రోనా విప‌త్క‌ర…

ఆరోగ్యం బాగున్న వాళ్లే క‌రోనా స‌మ‌యంలో పెళ్లి చేసుకోవ‌డానికి ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నారు. కొంద‌రైతే బంధు మిత్రాదులెవ‌రూ లేకుండా పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్టం లేక వాయిదా వేసుకుంటున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోడానికి ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేదు.

లోక‌మంతా ఒక‌లా ఆలోచిస్తుంటే, కేర‌ళ‌లో మాత్రం ఓ జంట అందుకు భిన్నంగా ప్ర‌వ‌ర్తించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఏకంగా క‌రోనా వార్డులోనే వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. కేర‌ళ‌లోని అల‌ప్పుజ వైద్య క‌ళాశాల‌లో ఆదివారం జ‌రిగిన పెళ్లి గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.

కేర‌ళ‌లోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్ విదేశాల్లో ప‌ని చేస్తున్నాడు. అత‌నికి అభిరామి అనే యువ‌తితో ఇటీవ‌ల వివాహ నిశ్చ‌య‌మైంది. ఈ నెల 25న  అంటే నేడు పెళ్లి జ‌ర‌పాల‌ని శుభ ముహూర్తాన్ని ఇరువైపు కుటుంబ పెద్ద‌లు ఖ‌రారు చేశారు. 

విదేశాల నుంచి స్వ‌స్థ‌లానికి వ‌చ్చిన శ‌ర‌త్ పెండ్లి ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు శ‌ర‌త్‌, అత‌ని త‌ల్లి క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో వారిద్ద‌రు అల‌ప్పుజ మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలోని క‌రోనా వార్డులో ట్రీట్‌మెంట్ కోసం చేరారు.

మ‌రోవైపు వివాహ స‌మ‌యానికే పెండ్లి చేసుకోవాల‌ని ఇరు కుటుంబాలు గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా వార్డులోనే పెండ్లి చేసుకునేందుకు సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు స్థానిక అధికారుల‌ను సంప్ర‌దించారు.

అధికారులు అనుమ‌తి ఇవ్వ‌డంతో నిర్ణ‌యించిన ముహూర్తానికే ఆ జంట వివాహ బంధంతో ఒక్క‌టైంది. ఈ సంద‌ర్భంగా వ‌ధువు అభిరామి పీపీఈ కిట్ ధ‌రించి అన్ని జాగ్ర‌త్త‌ల‌తో మూడు ముళ్లు వేయించుకుంది. క‌రోనా వార్డులో  దండ‌లు మార్చుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.