జనసేనాని పవన్కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు బీజేపీ, జనసేనానిపై విమర్శలు గుప్పించారు. నిన్న రాత్రి తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిని డ్రామాగా ఆయన అభివర్ణించారు.
తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కేవలం 30 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఘోర పరాజయం ఖాయం కావడంతో రాళ్ల దాడి డ్రామాకు తెరలేపారని టీడీపీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ జాతీయ నేత స్థాయి నుంచి టీడీపీ అధ్యక్షుడి స్థాయికి పడిపోయారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో వాస్తవాలు తెలుసుకుని నడ్డా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ప్రయివేట్ పోర్టులో షేర్లను అదానీ గ్రూప్ కొంటే వైసీపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ క్వారంటైన్కు వెళ్లింది భయపడా? లేక డబ్బు అందకా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు జనసేన మద్దతు పలకడంతో పాటు ప్రచారం కూడా నిర్వహించిన నేపథ్యంలో అంబటి విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బీజేపీ, టీడీపీలు తమ పాలనలో రాష్ట్రానికి ఈ అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదని అంబటి అన్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో, వాటిని 90 శాతం నెరవేర్చిందని అంబటి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతున్నట్టు అంబటి తెలిపారు.
మీడియా సమావేశంలో లోకేశ్ గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న మాటలకు సంబంధించి వీడియోను అంబటి ప్రదర్శించారు. ఈ నెల 17న ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోతుందని అచ్చెన్న అన్నారని అంబటి వీడియో ప్రదర్శించి చూపారు.