నరేష్ ఆధీనంలో ‘మా’ రికార్డులు?

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' మళ్లీ మరోసారి వార్తల్లోకి ఎక్కేలా కనిపిస్తోంది. 'మా'లో నిధుల కుంభకోణం జరిగినట్లు కొద్దిరోజుల కిందటి నుంచి ఆరోపణలు వినిపిస్తోంది. మా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి విదేశాల్లో జరిగే…

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' మళ్లీ మరోసారి వార్తల్లోకి ఎక్కేలా కనిపిస్తోంది. 'మా'లో నిధుల కుంభకోణం జరిగినట్లు కొద్దిరోజుల కిందటి నుంచి ఆరోపణలు వినిపిస్తోంది. మా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి విదేశాల్లో జరిగే కార్యక్రమాల హక్కులకు సంబంధించి ఏదో గడబిడ జరుగుతోందని, ఈ విషయంలో శివాజీరాజా, హీరో శ్రీకాంత్ తదితరులకు సంబంధాలు వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయని, సీనియర్ నరేష్ మాత్రం ఈ విషయంలో ముభావంగా వుంటున్నారని చాలారోజుల క్రితమే 'గ్రేట్ఆంధ్ర' వెల్లడించింది.

ఇటీవల ఈ విషయమై ఓ ఇంగ్లీష్ మీడియాలో మళ్లీ కథనాలు ప్రారంభమయ్యాయి. దీంతో సీనియర్ నరేష్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా మా ఆఫీసులో రికార్డులు అన్నీ పదిలంగా లోపలపెట్టి తాళం వేసి, ముందు అర్జెంట్ గా మీటింగ్ కాల్ ఫర్ చేయమని, అసలు ఎందుకు ఇలా కథనాలు వస్తున్నాయో తేల్చమని కోరినట్లు తెలుస్తోంది.

దీంతో ఈరోజు మా అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు బోగట్టా. గతంలో ఎన్నడూ లేనట్లు తరచు మా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి, వేలకు వేలు ఖర్చు చేస్తోందన్న పాయింట్ ఒకటి కూడా సభ్యుల అభ్యంతరాల్లో వున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో మహేష్ బాబు, ప్రభాస్ ల కార్యక్రమాల ప్లానింగ్ కూడా వుంది అని వినికిడి.

చిరంజీవి కార్యక్రమం హక్కులు విదేశాల్లో ఇచ్చేటపుడు కాస్త భారీ గోల్ మాల్ జరిగిందని అసలు ఆరోపణ ఒకటి వీటన్నింటి వెనుక వుంది. ఇప్పుడు అందుకే ఈ రెండు కార్యక్రమాల హక్కుల విషయం కూడా డిస్కషన్ కు వుంటుందని టాక్.

2019లో మళ్లీ మా సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధక్షుడు శివాజీ రాజా మళ్లీ మరోసారి అదే పదవి చేపట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.