మహానటి ఎఫెక్ట్: బయోపిక్ పక్కన పెట్టిన బాలయ్య

మహానటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఈ ప్రభావం దేనిపై పడుతుంది. భరత్ అనే నేను సినిమాపై పడుతుందా లేక నా పేరు సూర్యపై ప్రభావం చూపిస్తుందా..? ఇలా ఆలోచించే వాళ్లే ఎక్కువమంది.…

మహానటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఈ ప్రభావం దేనిపై పడుతుంది. భరత్ అనే నేను సినిమాపై పడుతుందా లేక నా పేరు సూర్యపై ప్రభావం చూపిస్తుందా..? ఇలా ఆలోచించే వాళ్లే ఎక్కువమంది. కానీ ఇంకా సెట్స్ పైకి రాని ఎన్టీఆర్ బయోపిక్ పై మహానటి ఎఫెక్ట్ పడింది. అవును.. ఈ సినిమా దెబ్బతో బయోపిక్ ను తాత్కాలికంగా పక్కనపెట్టేశాడు బాలయ్య.

బయోపిక్స్ ఎలా తీయాలో, ఎంత నిజాయితీతో చరిత్రను చూపించాలో మహానటితో చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇకపై బయోపిక్స్ తీస్తే ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వాలంటూ మహానటి సినిమాతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు.

మరోవైపు బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ ను పాటలు, ఫైట్స్ తో నింపేయాలని చూశాడు. పెద్ద ఎన్టీఆర్ నటించిన 5-6సూపర్ హిట్ సాంగ్స్ ను సినిమాలో పెట్టేయాలని భావించాడు. ఆయన వేసిన ఓ 60గెటప్స్ ను సినిమాలో చూపించేయాలని ఫిక్స్ అయ్యాడు. తేజ తప్పుకున్నది కూడా ఈ వ్యవహారం నచ్చకే.

ఇప్పుడు మహానటి సినిమా వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారనే విషయంపై బాలయ్యకు ఓ క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే మరింత రీసెర్చ్ కోసం సినిమాను పక్కన పెట్టాడు. తనే మెగాఫోన్ పట్టుకొని డైరక్ట్ చేద్దామనుకునే ఆలోచన నుంచి కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలా ఓపెనింగ్ జరిగి, సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది ఎన్టీఆర్ బయోపిక్.

ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోవడంతో.. ఈ గ్యాప్ లో వినాయక్ తో సినిమా చేయాలని నిర్ణయించాడు బాలయ్య. ఈనెల 27నుంచి ఈ సినిమా ప్రారంభమౌతుంది. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించబోతున్నాడు. శ్రియ ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో వినాయక్-బాలయ్య కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా శ్రియనే హీరోయిన్.