సరదా సరదాగా రంభ రీఎంట్రీ

రీఎంట్రీ అంటే ఎప్పుడైనా గ్రాండ్ గా ఉండాలి. ఎంట్రీ ఎవరిదైనా కావొచ్చు. అందులో కాస్త స్టార్ ఎట్రాక్షన్ ఉండి తీరాల్సిందే. అందరూ ఆలోచించేది ఇలానే. కానీ రంభ మాత్రం కాస్త వెరైటీ. తన రీఎంట్రీకి…

రీఎంట్రీ అంటే ఎప్పుడైనా గ్రాండ్ గా ఉండాలి. ఎంట్రీ ఎవరిదైనా కావొచ్చు. అందులో కాస్త స్టార్ ఎట్రాక్షన్ ఉండి తీరాల్సిందే. అందరూ ఆలోచించేది ఇలానే. కానీ రంభ మాత్రం కాస్త వెరైటీ. తన రీఎంట్రీకి ఓ కామెడీ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుంది. సరదా సరదాగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి, త్వరలోనే ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా, కాస్త “ఎక్స్ ట్రా” పనుల్ని కూడా సప్తగిరి చూసుకుంటున్నాడు. ఫైట్లు, పాటలు ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి లాంటి అంశాల్ని తనే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాలో నటించడానికి రంభ అంగీకరించింది. ఆమె రీఎంట్రీ మూవీ ఇదే.

నిజానికి రంభ తలుచుకుంటే ఇంతకంటే కాస్త మంచి ఆఫర్లే వస్తాయి. ఆమెకు ఇప్పటికీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. సీనియర్ హీరోలు లేదా దర్శకుల్లో ఎవర్ని రిక్వెస్ట్ చేసినా కాస్త పెద్ద సినిమా పడే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి ఏదో ఒక మూవీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవితో రంభ అనుబంధం అలాంటిది. కానీ ఈమె మాత్రం ఎందుకో సప్తగిరి సినిమాను సెలక్ట్ చేసుకుంది.

రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా మారిన రంభ, తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకున్న తర్వాత పరిశ్రమకు దూరమైంది. రీసెంట్ గా టీవీ కార్యక్రమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మాజీ హీరోయిన్.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేసే పనిలో పడింది. తెలుగులో ఆమె చేసిన ఆఖరి సినిమా దొంగ సచ్చినోళ్లు.