మ‌ళ్లీ రావాల్సి ఉంటుంద‌న్న ఈడీ అధికారులు?!

డ్ర‌గ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేడ్ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న సినీ తారల‌కు ఆ అధికారుల నుంచి ఒక మాట మాత్రం త‌ప్ప‌నిస‌రిగా వినిపిస్తోంద‌ట‌. అదే.. పిలిస్తే విచార‌ణ‌కు మ‌ళ్లీ రావాల్సి ఉంటుంది అనేది! ఈ మాట‌ను…

డ్ర‌గ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేడ్ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న సినీ తారల‌కు ఆ అధికారుల నుంచి ఒక మాట మాత్రం త‌ప్ప‌నిస‌రిగా వినిపిస్తోంద‌ట‌. అదే.. పిలిస్తే విచార‌ణ‌కు మ‌ళ్లీ రావాల్సి ఉంటుంది అనేది! ఈ మాట‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడుతున్నార‌ట అధికారులు. ద‌ర్శ‌కుడు పూరీ జగ‌న్నాథ్, న‌టి చార్మీ, మ‌రో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌నీలాండ‌రింగ్ అంశానికి సంబంధించి ఈ విచార‌ణ జ‌రుగుతూ ఉంది. 

ఈ సంద‌ర్భంగా అధికారులు స‌ద‌రు సెల‌బ్రిటీల బ్యాంక్ అకౌంట్ల గురించి వివర‌ణ కోరుతున్నార‌ని తెలుస్తోంది. వారి బ్యాంక్ లాగిన్ ల‌ను ఓపెన్ చేయించి, ఆన్ లైన్ ట్రాన్సాక్ష‌న్ల గురించి, ప్ర‌త్యేకించి విదేశీ న‌గ‌దు బ‌దిలీల గురించి వివ‌ర‌ణ కోరుతున్నార‌నేది ప్రాథ‌మిక స‌మాచారం.

వారికి ఏయే బ్యాంకు అకౌంట్లు ఉంటే, వాట‌న్నింటి వివ‌రాల‌నూ అధికారులు కోరుతున్నార‌ట‌. సెల‌బ్రిటీలు కూడా త‌ప్ప‌నిస‌రిగా వారి బ్యాంక్ అకౌంట్ వివ‌రాల‌ను అధికారుల ముందు చూపించాల్సి వ‌స్తోంది. అనుమానాస్ప‌ద లావాదేవీల గురించి వివ‌ర‌ణ కోరుతున్నార‌ట అధికారులు. వాటిని నోట్ చేసుకుని.. మ‌రింత విచార‌ణ చేప‌డ‌తార‌ట‌.

ఈ సంద‌ర్భంగా అధికారులు స్పందిస్తూ.. అవ‌స‌రం అయితే మ‌రోసారి విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని చెబుతున్న‌ట్టుగా స‌మాచారం. ఈ 'అవ‌స‌రం' అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. లావాదేవీలు అనుమానాస్ప‌దం అయితేనే.. అధికారులు మ‌ళ్లీ వీరిని విచార‌ణ‌కు పిలిపించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మ‌రి అనుమానాస్ప‌ద‌మా, కాదా అనే అంశం.. పూర్తి విచార‌ణ జ‌రిగితే కానీ తెలియ‌క‌పోవ‌చ్చు.

పూరీ, చార్మీ, ర‌కుల్ ల‌కు.. పిలిస్తే మ‌ళ్లీ విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌నే మాట‌ను త‌ప్ప‌నిస‌రిగా చెప్పార‌ట అధికారులు. అయితే వాళ్లు కూడా.. అంతే స్థాయిలో స్పందించార‌ట‌. పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందిస్తామ‌ని, విచార‌ణ‌కు ర‌మ్మ‌న్న‌ప్పుడు మ‌ళ్లీ రావ‌డంలో అభ్యంత‌రాలు ఏమీ చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. అయినా..అక్క‌డున్న ప‌రిస్థితి మ‌ళ్లీ విచార‌ణ‌కు రాము అంటూ ఎవ‌రూ గ‌ట్టిగా తేల్చి చెప్ప‌లేక‌పోవ‌చ్చు.

మ‌రి ఈ వ్య‌వ‌హారంలో ఈ టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా ఒట్టి సాక్షులు మాత్ర‌మే అని మొద‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఎవ‌రైనా రెండోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే ప‌రిస్థితి వ‌స్తే మాత్రం.. స‌మ్ థింగ్ ఈజ్ ఫిషీ అనే టాక్ బ‌య‌ల్దేరుతుందేమో!