‘బాహుబలి’తో తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని ప్రభాస్ ఊహించి వుండొచ్చు కానీ ఆ తర్వాత కూడా తన పాపులారిటీ కంటిన్యూ అయి పాన్ ఇండియా సూపర్స్టార్ అనిపించుకుంటాడని అనుకుని వుండకపోవచ్చు.
లేదంటే తదుపరి చిత్రాలను అనుభవం లేని సుజీత్, రాధాకృష్ణ కుమార్తో ముందే కమిట్ అయి వుండేవాడు కాదు. ప్రస్తుతం తన పాన్ ఇండియా ఇమేజ్ని కొనసాగిస్తూ, అదే సమయంలో అధిక సమయం తీసుకోని ప్రాజెక్టులను ప్రభాస్ జాగ్రత్తగా ఎన్నుకుంటున్నాడు.
ఇదిలావుంటే ప్రభాస్కి ఇలాంటి స్టార్డమ్ రావడానికి కారణమైన రాజమౌళి తన ప్రస్తుత చిత్రాన్ని ఎన్టీఆర్, చరణ్తో తెరెకక్కిస్తున్నాడు. తెలుగు సినిమాకు సంబంధించి ఇది అతి పెద్ద సినిమా. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలికి మించిన బృహత్తర ప్రయత్నం. కానీ పాన్ ఇండియా లెవల్లో ఈ తెలుగు మల్టీస్టారర్కి ఎంత క్రేజ్ వస్తుందనేది రాజమౌళి బ్రాండ్పై ఆధారపడి వుంటుంది.
అయితే ఈ సినిమా తర్వాత మన స్టార్లు తారక్, చరణ్ ఇండియా లెవల్లో ప్రభాస్ మాదిరిగానే గుర్తింపు తెచ్చుకుంటారా? దీని తర్వాత వారికీ అలాంటి పాన్ ఇండియా క్రేజే వుంటుందా? దీనిపై తారక్, చరణ్కి కూడా క్లారిటీ లేదు. అందుకే తారక్ ఆల్రెడీ త్రివిక్రమ్తో తదుపరి చిత్రం కమిట్ అయితే, చరణ్ ఇంకా తదుపరి చిత్రంపై నిర్ణయం కూడా తీసుకోలేదు.