సూర్యకిరణ్ మరణానికి అప్పులే కారణమా?

టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశాడు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఈయన ఈరోజు ఓ ప్రైవేటు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచాడు. సుమంత్ హీరోగా డైరక్ట్ చేసిన సత్యం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు…

టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశాడు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఈయన ఈరోజు ఓ ప్రైవేటు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచాడు. సుమంత్ హీరోగా డైరక్ట్ చేసిన సత్యం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్యకిరణ్.

నిజానికి దర్శకుడిగా కంటే ముందు సూర్యకిరణ్ నటుడు. బాలనటుడిగా వందల సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. సత్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సూర్యకిరణ్ తో పాటు హీరో సుమంత్ కు అది మంచి బ్రేక్ ఇచ్చింది.

అదే టైమ్ లో హీరోయిన్ కల్యాణితో సూర్యకిరణ్ కు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో విడిపోయారు.

ఓవైపు దర్శకుడిగా సక్సెస్ లేక, మరోవైపు వైవాహిక జీవితం సాఫీగా సాగక సూర్యకిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్టు అతడి సన్నిహితులు చెబుతుంటారు. మధ్యలో బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ.. కెరీర్ పరంగా మాత్రం అతడు రాణించలేకపోయాడు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా కూడా మారాడు.

ప్రొడ్యూసర్ గా మారి సినిమా తీయడమే సూర్యకిరణ్ చేసిన తప్పని అతడి సోదరి, నటి సుజిత వెల్లడించారు. ఆ సినిమా భారీగా నష్టాలు తెచ్చిపెట్టిందని, దీంతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

సూర్యకిరణ్ మృతికి కారణాల్ని అధికారికంగా వెల్లడించలేదు. కొన్నాళ్లుగా ఆయన పచ్చకామెర్లతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు సమాచారం.