కోట్ల లెక్క‌.. హీరోయిన్ కు లేని బాధ వీరికెందుకో!

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫిక్స్ డ్ డిపాజిట్ల‌కు సంబంధించి భారీ మొత్తాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ సీజ్ చేసిన మ‌రుస‌టి రోజు ఆమె హుషారుగా ఈద్ పార్టీలో క‌నిపించ‌డం ఇంట‌ర్నెట్ లో…

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫిక్స్ డ్ డిపాజిట్ల‌కు సంబంధించి భారీ మొత్తాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ సీజ్ చేసిన మ‌రుస‌టి రోజు ఆమె హుషారుగా ఈద్ పార్టీలో క‌నిపించ‌డం ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. బాలీవుడ్ లో త‌న‌ను బాగా ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్న స‌ల్మాన్ ఖాన్ ఇంట జ‌రిగిన ఈద్ పార్టీకి జాక్వెలిన్ హాజ‌రైంది. 

ఆ సంద‌ర్భంగా స‌ల్మాన్ తో పాటు ఆమె న‌వ్వుతూతుళ్లుతూ క‌నిపించింది. స‌ల్మాన్ సన్నిహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వారిలో నెటిజ‌న్ల చూపు ప‌డ్డ‌ది మాత్రం ఈ న‌టీమ‌ణి మీదే. సుఖేష్ చంద్ర‌శేఖ‌ర‌న్ అనే వ్య‌క్తి నుంచి జాక్వెలిన్ సుమారు తొమ్మిది కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు ర‌క‌ర‌కాల బ‌హుమ‌తులు పొందిన‌ట్టుగా ఈడీ త‌న విచార‌ణ‌లో తేల్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఆ మేర‌కు ఆమె వ్య‌క్తిగ‌త ఖాతాల నుంచి స‌రిగ్గా అంతే మొత్తం సొమ్ముల‌ను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి అవ‌కాశం ఉంద‌ని ఈ హీరోయిన్ కు ముందే తెలిసి ఉండ‌వ‌చ్చు కూడా! అయిన‌ప్ప‌టికీ ఆమె ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో డ‌బ్బు ఉంచిందనే అంశం కూడా గ‌మ‌నార్హం. ఈడీ స్టెప్స్ ను జాక్వెలిన్ కు సంబంధించిన ఏ లాయ‌ర్లో ప‌సిగ‌ట్టి ఉండ‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె చ‌ట్ట‌బ‌ద్ధంగా త‌న సొమ్ముల‌ను దాచిన‌ట్టుగా ఉంది! 

అయితే ఈ వ్య‌వ‌హారంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పొదుపు మొత్తాల‌న్నీ సుఖేష్ నుంచి పొందిన బ‌హుమానాలే అని ఈడీ రుజువు చేయ‌డం అస‌లైన కొస‌మెరుపుగా మిగిలింది. ఆ సంగ‌త‌లా ఉంటే.. తొమ్మిది కోట్ల రూపాయ‌ల జ‌ప్తు జ‌రిగినా.. ఆమె పెద్ద‌గా చ‌లించిన‌ట్టుగా లేదు. 

ఇదే నెటిజ‌న్ల‌ను నిరుత్సాహ ప‌రుస్తున్న‌ట్టుగా ఉంది. అంత జ‌ప్తు జ‌రిగింది కాబ‌ట్టి ఆమె ఏడుస్తూ కూర్చోవాలి త‌ప్ప‌, ఇలా పార్టీల‌కూ తిర‌గ‌డం ఏమిట‌న్న‌ట్టుగా నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు! అయినా ఆమెకు లేని బాధ వీరికెందుక‌బ్బా!