ప్రజా గాయకుడు గద్దర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. 3 రోజుల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ సక్సెస్ అయింది కూడా. ఇదే విషయాన్ని వైద్యులు ప్రకటించారు కూడా. మరి ఈరోజు హఠాత్తుగా ఆయన కన్నుమూయడానికి కారణం ఏంటి? గద్దర్ మరణించడానికి గల కారణాల్ని అపోలో హాస్పిటల్ వైద్యులు బయటపెట్టారు.
“గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ (77), హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్న అపోలో హాస్పిటల్ లో ఈరోజు 3 గంటలకు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన జులై 20వ తేదీన హాస్పిటల్ లో చేరారు. ఆగస్ట్ 3న ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించాం. సర్జరీ నుంచి ఆయన కోలుకున్నారు. అయితే ఆయన అప్పటికే ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో పోరాడుతున్నారు. ఈ సమస్యలకు తోడు పెరిగిన వయసు కారణంగా ఆయన కన్నుమూశారు.”
ఇలా గద్దర్ మృతిచెందడం వెనక కారణాల్ని వైద్యులు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజుల కిందట స్వయంగా గద్దర్ ప్రకటన చేశారు. గత నెల 31న ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తన వయసు 77 సంవత్సరాలుగా, తన వెన్నెముకలో ఉన్న తూటా వయసు 25 సంవత్సరాలుగా పేర్కొన్న గద్దర్.. తన ఆరోగ్య పరిస్థితి మొత్తాన్ని వివరించారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు. అలా ప్రకటించిన వారం రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు గద్దర్.