కరోనా లాక్ డౌన్ తో బాగా ఇబ్బంది పడుతున్న పరిశ్రమల్లో సినీ, సీరియల్స్ పరిశ్రమలున్నాయి. షూటింగులు ఆగిపోవడం, విడుదలలు కొశ్చన్ మార్క్ అయిపోవడంతో సినిమా నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు షూటింగులు జరుపుకుని విడుదల అయ్యే సీరియల్స్ రూపకర్తలది కూడా అదే పరిస్థితి. కొత్తగా కంటెంట్ షూటింగ్ జరుపుకోకపోవడంతో ఇప్పటికే నెలన్నరగా సీరియల్స్ ప్రసారాలు లేవు. అవే సీరియల్స్ టైమింగ్ లో వాటి పాత ఎపిసోడ్ లను ప్రసారం చేయడం లేదా, మరో ప్రోగ్రామ్ ను టెలికాస్ట్ చేస్తూ చానళ్లు పొద్దుపుచ్చుతున్నాయి.
తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. ఇటీవలే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను సీరియల్స్ ప్రొడ్యూసర్లు, చానళ్ల ప్రతినిధులు కలిశారు. సీరియళ్ల షూటింగులకు అనుమతి గురించి వారు విన్నపం చేశారు. సోషల్ డిస్టన్సింగ్ పాటిస్తామంటూ వాళ్లు షూటింగులు చేసుకోవడానికి అనుమతిని కోరారట. ఈ విషయమై సీఎంతో చర్చించి, నిర్ణయాన్ని చెబుతామని వారికి తలసాని చెప్పారట.
అయితే కన్నడ నాట మాత్రం సీరియల్స్ షూటింగులకు అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు యడియూరప్ప గవర్నమెంట్ సీరియల్ షూటింగులకు అనుమతిని ఇచ్చిందట. అయితే ఇప్పటికిప్పుడు అక్కడ సీరియల్స్ షూటింగులు మొదలుకావడం లేదు. మే 25 నుంచి షూటింగ్స్ మొదలుపెట్టాలని శాండల్ వుడ్ సీరియల్స్ మేకర్లు భావిస్తున్నారని సమాచారం.
ఇక తమిళనాడులో కూడా ప్రభుత్వం సినిమా వాళ్ల గురించి స్పందించింది. అక్కడ షూటింగులకు అనుమతిని ఇవ్వలేదు కానీ, పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని జారీ చేసినట్టుగా సమాచారం. కొన్ని సినిమాలకు సంబంధించి టెక్నీషియన్లు వర్క్ ఫ్రమ్ హోం ప్రాతిపదికన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తమిళనాట ఆఫీసులకు వెళ్లి ఇలాంటి పనులు చేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.