హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలంట

హీరోయిన్ త్రిషకు వివాదాలు కొత్త కాదు. ఈ సీనియర్ నటి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. పవిత్ర స్థలంలో చెప్పులు వేసుకొని నడిచినందుకు ఆమెపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. తక్షణం ఆమెపై కేసు…

హీరోయిన్ త్రిషకు వివాదాలు కొత్త కాదు. ఈ సీనియర్ నటి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. పవిత్ర స్థలంలో చెప్పులు వేసుకొని నడిచినందుకు ఆమెపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. తక్షణం ఆమెపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది..

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్-1 (పీఎస్-1) సినిమా చేస్తోంది త్రిష. ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లోని ఓ పురాతన ఆలయంలో జరుగుతోంది. త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ గ్యాప్ లో ఆలయం ప్రాంగణంలో చెప్పులతో నడిచింది త్రిష. 

అంతేకాదు.. శివలింగం, నంది మధ్య నుంచి చెప్పులతో ఆమె నడిచిన ఫొటో వైరల్ అయింది. ఇదే హిందూ ధార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే త్రిషపై కేసు పెట్టి, ఆమెతో పాటు దర్శకుడు మణిరత్నంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటోలే వద్దనుకుంటే.. ఏకంగా వివాదం రేగింది

నిజానికి పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్ లో ఎలాంటి ఫొటోలు తీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీనికి కారణం తాజాగా ఐశ్వర్యరాయ్ లుక్ రివీల్ అవ్వడమే. ఈ సినిమా సెట్స్ లో ఐశ్వర్యరాయ్ ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో సినిమాలో ఆమె లుక్ ఎలా ఉండబోతోందనే విషయం బయటకుపొక్కింది.

అప్పట్నుంచి సెట్స్ లో కెమెరాల్ని బ్యాన్ చేశారు. ఫొటోలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయినప్పటికీ త్రిషకు సంబంధించిన స్టిల్స్ లీక్ అవ్వడం, అందులో ఏకంగా ఆమె చెప్పులతో నడవడం ఉన్న ఫొటోలు బయటకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదాన్ని త్రిషతో పాటు సినిమా యూనిట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.