‘విరూపాక్ష’కు కథే హీరో

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో  బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న…

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో  బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీలో పాత్రలను వారి వారి గెటప్ లతో పరిచయం చేస్తూ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. '2019లో ఈ కథ విన్నాను. ముందుగా సుకుమార్ నుంచి కాల్ వచ్చింది. కథ విను.. కచ్చితంగా నీకు నచ్చుతుంది. చేస్తావ్ అని అన్నారు. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు కార్తీక్‌కు హ్యాట్సాఫ్. శ్యాం గారి కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్‌ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాకు కథే హీరో. హారర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. తారక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారు. ఇప్పుడు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి. మంచి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓ ఫిక్షన్ స్టోరీ అందరికీ రీచ్ అవుతుందని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నేను నందిని అనే పాత్రను పోషించాను. రెండేళ్ల క్రితం నాకు ఈ స్టోరీని వినిపించారు. నాకు ఈ పాత్ర ఎంతగానో నచ్చింది. నందిని పాత్ర కోసం నా ప్రాణం పెట్టేశాను. ప్రతీ పాత్రను ఎంతో డీటైలింగ్‌గా చూపించారు. షూటింగ్ ఫస్ట్ రోజు ఎంతో నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. ఈ పాత్ర కోసం చెప్పులు వేసుకోకుండా నటించాను. ఇలాంటి పాత్ర దక్కడం గొప్ప అదృష్టం. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు.

దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథను 2018లో రాశాను. రంగస్థలం షూటింగ్‌లో ఉన్న సుకుమార్ కు ఈ కథను చెప్పాను. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ కరోనా గ్యాప్‌లో కథను ఎక్కడా మార్చలేదు. యాక్సిడెంట్‌ తరువాత తేజ్ గారిలో తెలియని ఓ భయం ఉండేది. సెట్‌లో ఫస్ట్ డే రోజు తేజ్ గారు మాటలు సరిగ్గా రావడం లేదని, దాని ద్వారా వేరే వాళ్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అనే భయంలో ఉండేవారు. కానీ నాలుగో రోజు వచ్చి అదరగొట్టేశారు. టెక్నీషియన్స్ అందరికీ రుణపడి ఉంటాను. టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశాం. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశామ' అని అన్నారు.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు టెక్నీషియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎప్పుడూ కథను నమ్మే సినిమాలు చేశాను. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నామ'ని అన్నారు.

నటుడు సాయిచంద్ , కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, శ్యామల, అభినవ్ గోమటం, అజయ్ తదిరులు పాల్లొని ప్రసంగించారు.