అసెంబ్లీ ఎన్నికల్లో వేగం… లోక్​సభ ఎలక్షన్స్​ నాటికి ఆగం

ఎవరి డెస్టినీ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు సంభవిస్తయో, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది మనుషులకే కాదు, రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది. రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి.…

ఎవరి డెస్టినీ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు సంభవిస్తయో, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది మనుషులకే కాదు, రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది. రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఇప్పుడు చెప్పుకున్నదంతా బీఆర్​ఎస్​ పార్టీకీ, కాంగ్రెసు పార్టీలకు బాగా వర్తిస్తుంది.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటే, అన్ని ఏళ్లు అధికారం అనుభవించి కన్నూ మిన్నూ కానకుండా ఎగిరెగిరి పడిన బీఆర్​ఎస్​ అథమ స్థితిలో ఉంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి తొడగొట్టి సవాల్​ చేసిన బీఆర్​ఎస్​ లోక్​సభ ఎన్నికల నాటికి చతికిల పడిపోయింది. కేసీఆర్​ భాషలో చెప్పాలంటే ఆగమాగమైంది.  లోక్​సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థులు దొరకడంలేదనడం కంటే పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదనడం కరెక్టు. 

మొన్నటి వరకు కారు ఓవర్‌లోడు అయినట్లు కనిపించింది. ఒక్కో అసెంబ్లీ, లోక్‌సభ స్థానానికి కనీసం పది మంది అభ్యర్థులు ఆ పార్టీ తరఫున పోటీకి పోటీపడ్డారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉండగా కీలక మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌.. విపక్షంలోకి వచ్చాకా పార్టీ నేతలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కేటీఆర్‌ను కలవడమే ఒక ప్రహసనంలా భావించిన వారు, ఆయన దర్శనమే మహద్భాగ్యం అనుకున్నవారు ఇప్పుడు లైట్‌ తీసుకుంటున్నారు. ఇక మరో కీలక నేత హరీశ్‌రావు సైతం సిద్దిపేటకే పరిమితమవుతున్నారు.

పార్టీని వీడేవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. దీంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌ రంగంలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు మొదలు పెట్టారు. కనీసం వంద కోట్లు ఖర్చుపెట్టే నేతలను ఎంపిక చేస్తున్నారు. అయితే అంత ఖర్చు పెట్టేవారు తమ ప్రయోజనాలు నెరవేరాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో లేదు. ఎంపీ సీట్లు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయడాకి కూడా సంపన్నులు ఇష్టపడడం లేదు. టికెట్‌ ఇస్తామన్నా మొహం చాటేస్తున్నారు. 

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, కాంగ్రెస్‌లో టికెట్ రాదనుకున్న మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్,  బీజేపీ అభ్యర్థుల కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం.. ఒక వేళ టిక్కెట్ ఇస్తే ఉంటారా .. వెళ్లిపోతారా అన్న సందిగ్ధంలో పడింది. ప్రస్తుత రాజకీయ పరిమామాలు బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. నిన్నటి దాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూడటంతో కేసీఆర్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో హైదరబాద్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆ పార్టీకి నేడు లోక్‌సభ అభ్యర్థులు కరువవయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన కుమారుడు కేటీఆర్.. విపక్షంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవటం, హరీష్ రావు సైతం కేవలం తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావటంతో కేసీఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.  ఎంపీగా పోటీచేయాలంటే వంద కోట్లైనా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో దీనికోసం పోటీపడే వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకోవటం సహజమే. అయితే.. పార్టీ ఓటమితో పాత నేతలెవరూ ఇప్పుడు ఎంపీ సీటు మాకొద్దంటే మాకొద్దని దూరంగా ఉంటున్నారు.

గతంలో కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగి, పోటీకి ఉవ్విళ్లూరిన కొందరు సంపన్నులు సైతం మొహం చాటేయటం ఆ పార్టీని కలవరపరుస్తోంది.  రాష్ట్రంలో అధికారం పోయినా  సిట్టింగ్ సీట్లను నిలుపుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. సిట్టింగ్‌లలో ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు.. కుమారుడు భరత్‌కు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కి బీజేపీ సీటు కూడా ఇచ్చేసింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ సీటులో బొంతు శ్రీదేవి కాంగ్రెస్ నుంచి నిలిచే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు బరిలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. 

అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ను పొగుడుతూ రాజకీయం చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సొంత సీటులో మారిన రాజకీయాలతో కేసీఆర్ పేరే ఎత్తటం లేదు. తెలగాణలో ముస్లింల ఓటు బ్యాంక్ చాలా కీలకం. మజ్లిస్ సహకరిస్తే.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్  వంటి చోట్ల.. కాంగ్రెస్ పార్టీ .. డామినేట్  చేసే అవకాశం ఉంది. మజ్లిస్ పాలసీ ప్రకారం అధికార పార్టీకే అండగా ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో మాత్రమే.. అసదుద్దీన్​  నిలబడి.. మిగిలినచోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ బలాన్ని మరింత తగ్గించడమే అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 4 గెలుచుకోగా, బీఆర్ఎస్ బలం 2 సీట్లకు పడిపోయింది.  

ఈ రెండు నెలల్లో అక్కడి అనేక గ్రామ, మండల, స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్‌లో చేరిపోవటంతో అక్కడ అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. నిజామాబాద్ సీటులో గతంలో పోటీ చేసిన కుమార్తె కవిత సైతం పోటీకి సిద్ధపడటం లేదు.  మరెవరూ ఆ సీటు అడగడం లేదు. బండి సంజయ్ సిట్టింగ్‌గా ఉన్న కరీంనగర్‌ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కే చాన్సిచ్చారు. మెదక్ ఎంపీ సీటు పరిధిలోని 7 స్థానాల్లో కేవలం మెదక్ సీటు తప్ప అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎలాంటి పరిస్థితిలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నా.. అభ్యర్థి  విషయంలో మాత్రం పీట ముడిపడిపోయింది.  జహీరాబాద్ ఎంపీ పరిధిలోని సెగ్మెంట్లలో 4 కాంగ్రెస్ చేతిలో, ఒకటి బీజేపీకి దక్కగా బీఆర్ఎస్ బాన్స్‌వాడ, జహీరాబాద్ సీట్లకే పరిమితమైంది. దీంతో అక్కడా సీటు తీసుకునేందుకు ఎవరూ సాహసించటం లేదు. 

సిట్టింగ్ ఎంపీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ‌ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ బాట పట్టటంతో అక్కడ నామా నాగేశ్వరరావుకే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. సికింద్రాబాద్ సీటు నుంచి తలసాని సాయిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది  ఎక్కువ మంది భావన.