సోషల్ మీడియా జోరు..ఎల్లో మీడియా బేజారు

జగన్ పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించలేదు. ఇన్ చార్జ్‌ల‌ను ప్రకటించారు. బై డీఫాల్ట్ వాళ్లే అభ్యర్ధులు అవుతారనేది వైకాపా పార్టీలో నూటికి తొంభై శాతం వుంది. అందుకే అలా అవకాశం రాని వాళ్లు జంప్…

జగన్ పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించలేదు. ఇన్ చార్జ్‌ల‌ను ప్రకటించారు. బై డీఫాల్ట్ వాళ్లే అభ్యర్ధులు అవుతారనేది వైకాపా పార్టీలో నూటికి తొంభై శాతం వుంది. అందుకే అలా అవకాశం రాని వాళ్లు జంప్ అయ్యారు. గోల పెట్టిన వారు గోల పెట్టారు. ఇక అప్పుడు చూడాలి ఎల్లో మీడియా సంబరం. మర్నాడు పత్రికలేంటీ, డిజిటల్ మాధ్యమాలేమిటి ఈ వార్తలే టముకేసాయి. సరే మెల్లగా అన్నీ సర్దుకున్నాయి.

ఇప్పుడు తెదేపా-జనసేన వంతు వచ్చింది. ఇటు తేదేపాలోనూ, అటు జనసేనలోనూ అసంతృప్తి భగ్గుమంది. జనసేనకు టికెట్ లు ఇచ్చిన అయిదు చోట్ల తెలుగుదేశంలో, జనసేనకు టికెట్ లు ఇవ్వని చోట్ల జనసేనలో అసంతృప్తి బాహాటంగానే పెల్లుబుకింది. కానీ పొత్తు చాలా అద్భుతంగా వుందని, పవన్ కళ్యాణ్- చంద్రబాబు ఇద్దరూ చాలా అద్భుతమైన పరిణితి కనబర్చారని ఎల్లో మీడియా టముకు వేయడం ప్రారంభించింది. అక్కడితో ఆగలేదు. అసంతృప్తి వార్తలన్నీ కనపడకుండా దాచేసారు.

అయితే నా కోడి.. నా కుంపడి అనే రోజులు పోయాయి. ఇది సోషల్ మీడియా కాలం. అందుకే కొన్ని ఎల్లో మీడియా సోషల్ మీడియా హ్యాండిల్స్ తాము మీడియా అన్న సంగతి కూడా పక్కన పెట్టి పార్టీ హ్యాండిల్స్ లా మారిపోతున్నాయి. జనసేన కుర్రాళ్లకు సుద్దులు చెబుతున్నాయి. జగన్ బూచిని చూపించి, చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నాయి. చంద్రబాబు కోసం కాదు జగన్ ను ఓడించడం కోసం కలిసి రావాలి అంటున్నాయి. అంతా లోకకళ్యాణం కోసం తప్ప చంద్రబాబు కోసం కాదంటున్నాయి.

కానీ ఈ ఎల్లో మీడియా హ్యాండిల్స్ ఫేస్ బుక్ లోకి, వాట్సాప్ లోకి చొరబడలేవు. కాపు బంధువుల గ్రూపుల్లోకి వెళ్లి వాళ్ల భావజాలాన్ని ప్రభావితం చేయలేవు. కేవలం ట్విట్టర్ లో ఈ ఎల్లో హ్యాండిల్స్ తెగ పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి. కానీ అసలు పోరాటం వాట్సాప్ ల్లో జరుగుతోంది. భావాలు షేర్ అవుతున్నాయి. అవన్నీ చదివితే ఈ ఎల్లో మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ బేజారెత్తిపోవడం ఖాయం.

ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత గగ్గోలు పెట్టినా జనానికి చేరడం లేదు. ఎందుకంటే వాటికి జనం ఎప్పుడో ముద్ర వేసి వదిలేసారు. దృశ్య మాధ్యమం పైగా దేనికి వుండాల్సిన ముద్ర దానికి వుంది. ఇక మిగిలింది డిజిటల్, సోషల్ మీడియానే. ఇక్కడ తమ పట్టులేక ఎల్లో హ్యాండిల్స్ కిందా మీదా అవుతున్నాయి. వాటి ట్వీట్ ల కింద వున్న కామెంట్లు చదివితే చాలా వాళ్లకి క్లారిటీ వస్తుంది. తము చెప్పే అబద్దాలు, సుద్దులు ఎవరూ నమ్మడం లేదని.