కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వైఫల్యం మోడీ, అమిత్ షాల ఖాతాలో పడకుండా చూసుకుంటున్నారు భక్తులు. కర్ణాటక పాలనను మూడు నాలుగేళ్ల నుంచి ఢిల్లీ నుంచినే సాగించారు. ఇందులో అణువంత అతిశయోక్తి లేదు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కర్ణాటక బీజేపీ నేతలు క్రియాశీలక పాత్ర పోషించారు. చివరకు యడియూరప్ప సీఎం అయ్యారు. అప్పటికప్పుడు కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అదే పెద్ద వివాదాస్పదంగా నిలిచింది. అసెంబ్లీలో పోర్న్ ఫిల్మ్ లను చూసిన వారిని కూడా అప్పుడు కేబినెట్లోకి చేర్చుకున్నారు!
అయితే ఆ వెంటనే కర్ణాటక పాలనా వ్యవహారాలు ఢిల్లీ చేతికి వెళ్లాయి. ఎంతలా అంటే.. ఆ తర్వాత యడియూరప్ప మళ్లీ కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేయలేకపోయారు! ఏడాది రెండేళ్ల పాటు సీఎంగా కొనసాగిన యడియూరప్ప కేబినెట్ విషయంలో చాలా పాట్లే పడ్డారు. విస్తరణ, పునర్వ్యస్థీకరణ అంటూ రెండేళ్ల పాటు ఆయన అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు కూడా పెట్టుకున్నారు! అయితే.. ప్రయోజనం దక్కలేదు. చివరకు యడియూరప్పను సీఎం సీటు నుంచి పక్కకు దింపేశారు!
కేబినెట్ గురించి అన్ని పాట్లు పడిన తొలి సీఎంగా యడియూరప్ప నిలిచారు. ఇక బొమ్మై సీఎం అయ్యాకా కూడా బెంగళూరు- ఢిల్లీ యాత్రలు ఆయన లెక్కకు మించి చేపట్టారు. అనేక సార్లు సీఎం అప్పటికప్పుడు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ ఢిల్లీ యాత్రలు చేపట్టిన దాఖలాలున్నాయి! తుమ్మాలాన్నా, దగ్గాలన్నా.. ఢిల్లీ అనుమతితోనే జరిగినట్టుగా అగుపించి కర్ణాటక పాలన! యడియూరప్పకూ చేతులు కాళ్లు కట్టేశారు. అయినా.. యడియూరప్పను అంతగా కట్టేసినా.. ఆయననే మళ్లీ అవినీతి అంటూ ఎందుకు తప్పించారో సామాన్యులకు బోధపడదు.
ఇక బొమ్మై కేవలం ఆటబొమ్మలానే పని చేశారు. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది వ్యవహారం. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ బీజేపీ పూర్తిగా ఢిల్లీ నుంచినే ఆపరేట్ అయ్యింది. ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, అభ్యర్థులు.. ఇలా అంతా ఢిల్లీ నిర్ణయానుసారమే సాగింది. యడియూరప్పను అభ్యర్థుల ఎంపిక కమిటీలో నామమాత్రంగా ఉంచారు కానీ, ఆయన చెప్పిందేమైనా జరిగి ఉంటుందనేది అనుమానమే! సిట్టింగులను చాలా మందిని పక్కన పెట్టారు.
ఏకంగా 70 మంది పాత వాళ్లకు టికెట్లను నిరాకరించి కొత్త వారిని తెరపైకి తెచ్చారు. ఇదంతా కర్ణాటక రాజకీయాన్ని బీజేపీ అధిష్టానం తన చేతుల్లోకి తీసుకున్న వైనానికి నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే.. అభ్యర్థుల వ్యవహారం లో కాంగ్రెస్ అధిష్టానం చేతులు పెట్టలేదు. పూర్తిగా సిద్ధరామయ్య- డీకేశి లకు వదిలేసింది. ప్రచారంలో కూడా రాహుల్, ప్రియాంకలు నామమాత్రంగా ఇన్ వాల్వ్ అయ్యారు.
అయితే బీజేపీ ప్రచారం అంతా మోడీనే చేశారు. తనే సీఎం అభ్యర్థి అయినట్టుగా మోడీ ప్రచారం చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, సభలు.. అంతా మోడీనే. అమిత్ షా కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు. తీరా ఫలితాలు తేడా కొట్టేశాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓటమికి మోడీ, షాలు బాధ్యులు కాదంటూ అంతా స్థానిక నేతల వైఫల్యమే అంటూ వాట్సాప్ యూనివర్సిటీ మొదలుపెట్టింది. ఓటమికి బాధ్యతంతా బొమ్మైదే అంటూ ఆయననో స్కేప్ గోట్ నుచేశారు. మోడీ, షాలు కర్ణాటకలో అంతా తామయ్యారు కదా.. అంటే, అబ్బే.. వాళ్ల వల్లే ఆ 66 సీట్లు అయినా దక్కింది అంటూ వాదిస్తూ ఉన్నారు!
కర్ణాటక సీఎం అభ్యర్థి ఏమైనా మోడీనా? అంటూ ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఎదురుప్రశ్నిస్తోంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా ఎక్కువ మోడీనే ప్రచారం చేశారు కదా. తనను చూసి బీజేపీని గెలిపించాలన్నట్టుగా వ్యవహరించారు కదా! ఇలాంటివన్నింటినీ వాట్సాప్ యూనివర్సిటీ ఎదురుదాడి రీత్యా దాచేసి వాదిస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు