తిరుమల నడక దారిలో మరో చిరుత బోనుకు చిక్కింది. అటవీ అధికారుల ట్రాప్కు చిక్కిన నాలుగో చిరుత ఇది. ఇటీవల నడక దారిలో చిన్నారులపై చిరుత దాడి తీవ్ర కలకలం రేపింది. చిరుత దాడిలో గాయాలపాలైన ఐదేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడగా, నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నడక దారిలో భక్తుల భద్రతపై టీటీడీ సీరియస్గా దృష్టి సారించింది.
మరోవైపు కాలి నడక మార్గంలో సంచరించే చిరుతలను బందించేందుకు అటవీ అధికారులతో కలిసి టీడీపీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాలను అమర్చి చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ, అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కీలక ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. ఇలా మూడు చిరుతలను బందించారు.
తాజాగా అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్ చేసి బందించారు. ఈ చిరుత గత పది రోజులుగా బోను సమీపానికి వెళుతూ చిక్కకుండా తప్పించుకునేది. అటవీ అధికారుల శ్రమ ఎట్టకేలకు ఫలించింది. ఈ చిరుతను తిరుపతి జూకు తరలిస్తారా? లేక ఇతర ప్రాంతాల్లోని దట్టమైన అడవిలో విడిచిపెడ్తారా? అనేది ఇంకా అధికారులు నిర్ణయించుకోలేదు.