తిరుమల కాలి నడక మార్గంలో మరో చిరుత బందీ అయ్యింది. నడక మార్గంలో చిన్నారులపై చిరుతల దాడి నేపథ్యంలో టీటీడీ, అటవీశాఖ సంయుక్తంగా ఆపరేషన్ చిరుత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. తాజాగా అలిపిరి నడక మార్గంలో నరసింహ ఆలయం ఏడో మైలు రాయి వద్ద చిరుత పట్టుబడింది. మూడు నెలల వ్యవధిలో ఐదు చిరుతలు పట్టుబడినట్టైంది.
చిరుతల నుంచి రక్షణ కోసం నడకదారి భక్తులకు బుధవారం నుంచి టీటీడీ కర్రల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. చిరుతల సంచారం పెరిగి, భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక బాలుడు ప్రాణాలతో బయటపడగా, ఆరేళ్ల బాలిక చనిపోయింది. దీంతో భక్తుల ప్రాణాలను టీటీడీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో భక్తుల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆపరేషన్ చిరుత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 24న మొట్టమొదట చిరుతను బందించింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో ఏకంగా మూడు చిరుతలను వేర్వేరు సందర్భాల్లో అటవీ అధికారులతో కలిసి టీడీపీ పట్టుకుంది.
నరసింహ ఆలయం వద్ద మరో చిరుత సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల ద్వారా టీటీడీ, అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు పకడ్బందీగా బోనులను ఏర్పాటు చేశారు. వారి ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు ఆ చిరుత కూడా చిక్కింది.