ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు న‌మోదు!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త నెల రోజుల్లో గొడ‌వ‌లే గొడ‌వ‌లు. భూవివాదం కేసులో ఏకంగా టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్తే హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో నిందితులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావ‌డం…

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త నెల రోజుల్లో గొడ‌వ‌లే గొడ‌వ‌లు. భూవివాదం కేసులో ఏకంగా టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్తే హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో నిందితులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కిడ్నాప్‌, భౌతిక‌దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌పై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల పాత్ర‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

వైసీపీ నాయ‌కుడు భూమా కిశోర్‌రెడ్డి అనుచ‌రుడైన చాక‌లి శీనును రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి, చిత‌క్కొట్టారు. నేరుగా అఖిల‌ప్రియ ఇంటికే తీసుకెళ్లి చావ‌బాదిన‌ట్టు బాధితుడు చాక‌లి శీను పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే జై అఖిల‌ప్రియ, జై భార్గ‌వ్‌రామ్‌, జై విఖ్యాత్ అనాల‌ని శీనుపై కిడ్నాప‌ర్లు ఒత్తిడి తెచ్చారు. శీనును చిత‌క్కొట్టి క‌డ‌ప మార్గంలో పొలంలో ప‌డేసి వెళ్లారు.

త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు బాధితులు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో వెల్ల‌డించాడు. ఈ ఘ‌ట‌న‌లో ఐదో నిందితుడిగా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ పేరు చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గుడ్డిలో మెల్ల చందానా… కొస‌మెరుపు ఏంటంటే అఖిల‌ప్రియ భ‌ర్త‌పై కేసు న‌మోదు కావ‌డం. ఆళ్ల‌గ‌డ్డ‌లో నెలలోనే టీడీపీకి చాలా మంచి పేరు వ‌చ్చేలా అఖిల‌ప్రియ దంపతులు ప‌ని చేస్తున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు సంతోషిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.