నటనలో తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ పే..ద్ద తోపు అనుకుంటే, పొలిటికల్ లైఫ్లో అంతకు మించి తానని చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్ హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబునాయుడిపై ఆకాశమే హద్దుగా రజినీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో రజినీకాంత్ పాత్రపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో పోస్టులు వైరల్ అయ్యాయి.
రజినీకాంత్పై విమర్శలు చేయడం ఏంటంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది చాలదన్నట్టు రజినీకాంత్కు బాబు ఫోన్ చేసి, వైసీపీ నేతలు తిడుతున్న విషయాన్ని చెప్పారట. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు చేయదగ్గ పనేనా ఇది? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్న ఎదురవుతోంది.
14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు… తన స్థాయిని దిగజార్చుకుని, తనను తిట్టినందుకు మీపై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? చిల్లర రాజకీయాలంటే ఇవే కదా? అనే చర్చకు తెరలేచింది. తనను వైసీపీ నేతలు తిడుతున్నారని బాబు మాటలకు రజినీకాంత్ స్పందిస్తూ…. ఇలాంటివి లెక్క చేయనని చెప్పారట. అంతేకాదు, తన అభిప్రాయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారట!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాలక్ష ఉంటాయి. అలాగని రజినీకాంత్కు తిరిగి ఫోన్ చేయడమే చిల్లరగా వుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా చంద్రబాబు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటో అంతుచిక్కడం లేదు. ఎటూ రజినీకాంత్ అభిమానులంతా టీడీపీ వైపే ఉంటారని, ఇంకా కొత్తగా ఏం సాధించాలని తమిళ సూపర్స్టార్కు చంద్రబాబు ఫోన్ చేశారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులకు ఫిర్యాదు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని సెటైర్స్ పేలుతున్నాయి.