మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని విమర్శించారు. నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకూ అవినీతి పునాదులపై నిర్మించారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ను ప్రజాకోర్టుకు ఈడుస్తామని, అక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు.
రూ.118 కోట్లు లంచంగా తీసుకున్నావని ఒక వైపు ఐటీశాఖ నోటీసులు ఇచ్చినా, వాటికి సమాధానం చెప్పలేదన్నారు. పొంతన లేని లేఖలను చంద్రబాబు రాస్తున్నారని ఆగ్రహించారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. రూ.118 కోట్లు అనేది చిన్న మొత్తమని, ఇది తీగ మాత్రమే అని, దాన్ని కదిపితే డొంకంతా కదులుతోందని మంత్రి అన్నారు.
రానున్న రోజుల్లో చంద్రబాబు భారీ మొత్తంలో దోచుకున్న సొమ్ముకు సంబంధించి అవినీతి బాగోతం బయటపడుతుందన్నారు. రూ.118 కోట్ల అవినీతి సొమ్ము తీసుకున్నారని చంద్రబాబుకు 46 పేజీల షోకాజ్ నోటీసును ఐటీశాఖ ఇచ్చిందన్నారు. ఈ నోటీసును తీసుకోడానికి చంద్రబాబు నిరాకరించారని ఆయన అన్నారు. అవినీతిలో తన పేరు లేదని, మరోసారి అసలు నోటీసులు ఇవ్వడానికి మీ పరిధి కాదంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, అన్స్కిల్డ్ పొలిటీషియన్ అని వెటకరించారు. చంద్రబాబు తుప్పు పట్టిన నాయకుడన్నారు. కానీ తాను నిప్పు అంటే చంద్రబాబును ఎవరూ నమ్మరన్నారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి భూముల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడినట్టు మంత్రి విమర్శించారు.