ఇప్పటం పిటిషనర్లకు హైకోర్టు భారీ జరిమానా విధించడంతో జనసేనాని పవన్కల్యాణ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడేం సమాధానం చెబుతారని పవన్ను నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మందికి ఏపీ హైకోర్టు జరిమానా విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పటంలో రోడ్ల విస్తరణను ప్రభుత్వం చేపట్టింది. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం తెగబడిందంటూ ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది హైకోర్టును ఆశ్రయించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు దిగారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో… స్టే ఇచ్చింది. అయితే తమను మోసగించారని కోర్టు గ్రహించి భారీ జరిమానా విధించింది.
ఈ నేపథ్యంలో పిటిషనర్లకు విధించిన భారీ జరిమానాను జనసేనాని పవన్కల్యాణ్ చెల్లిస్తారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 5న ఇప్పటం గ్రామంలో పవన్కల్యాణ్ సినీ షూటింగ్ను తలపించే సీన్ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటంలో పవన్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘మీరు మా మట్టిని కూల్చారు. మా ఇంటిని కూల్చారు. మీ కూల్చి వేత తథ్యం. గుర్తు పెట్టుకోండి’ అంటూ ఆ నేలపై మట్టిని తీసుకుని పవన్కల్యాణ్ శపథం చేశారు. అలాగే ఇడుపులపాయలో మీ మీదుగా హైవే వేస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పవన్కల్యాణ్ పరువు పోయింది. కేవలం సీఎం జగన్పై అక్కసుతోనే పవన్ రచ్చ చేశారని లోకానికి తెలిసొచ్చింది. నోటీసుల విషయమై పవన్ను కూడా పిటిషనర్లు మోసం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అనేవి అధికారికంగా ఇచ్చినవి. ఆ సంగతిని పిటిషనర్లు దాచి పెట్టి ఏం సాధించాలని అనుకున్నారో అర్థం కావడం లేదు.
ఇప్పటంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ… కేవలం తన పార్టీ సభకు భూమిని ఇవ్వడం వల్లే అని చెబుతున్న పవన్కల్యాణ్, హైకోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి.