విశాఖ నుంచి ఎంపీగా సుబ్బరామిరెడ్డి…!?

విశాఖ నుంచి ఎంపీగా టి. సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తారా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. టి. సుబ్బరామిరెడ్డి విశాఖ ఎంపీగా కాంగ్రెస్ నుంచి 1996, 1998లలో రెండు సార్లు పోటీ చేశారు. రెండు…

విశాఖ నుంచి ఎంపీగా టి. సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తారా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. టి. సుబ్బరామిరెడ్డి విశాఖ ఎంపీగా కాంగ్రెస్ నుంచి 1996, 1998లలో రెండు సార్లు పోటీ చేశారు. రెండు సార్లు గెలిచారు. అయితే 1999లో మాత్రం టీడీపీ అభ్యర్ధి ఎంవీవీఎస్ మూర్తి చేతిలో ఓడారు.

ఆ తరువాత ఆయన మూడు సార్లు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఇక ఆయన 2018 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న నేపధ్యంలో సీనియర్లకు ఆ పార్టీ ఈసారి ఎంపీ అభ్యర్ధులుగా పోటీలోకి దించుతుందని అంటున్నారు.

విశాఖ నుంచి టి. సుబ్బరామిరెడ్డిని పోటీ చేయించాలని హై కమాండ్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ మేరకు ఆయనకు కూడా సందేశాన్ని పంపించినట్లుగా తెలుస్తోంది. టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రచార ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించినట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్యనే విశాఖ వచ్చి పార్టీ నాయకులతో టీఎస్సార్ మాట్లాడారు. ఆయన విశాఖను తన పుట్టిల్లుగా చెబుతారు. టి. సుబ్బరామిరెడ్డి పోటీ చేస్తేనే గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ అధినాయకత్వం అభిప్రాయపడుతోంది. ఆయన తొందరలోనే విశాఖకు వస్తారని తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని అంటున్నారు.

టీఎస్సార్ కనుక ఎంపీగా రంగంలో ఉంటే కనుక కచ్చితంగా ట్రిముఖ పోటీ ఏర్పడుతుంది అని అంటున్నారు. అది ఎవరికి లాభిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. విశాఖలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ మోహరించిన సందర్భంలో కాంగ్రెస్ నుంచి బిగ్ షాట్ గా టీఎస్సార్ దిగితే ఓట్ల చీలిక తప్పదనే అంటున్నారు.