ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏకంగా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడి ఎందుకో తెలుసా? టీటీడీ నూతన పాలక మండలిలో తమ వాళ్లకు అవకాశం ఇవ్వాలని సీఎంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో, కొత్త చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. వారం క్రితం ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్త పాలక మండలి సభ్యుల ఏర్పాటుపై సీఎం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి.
టీటీడీ బోర్డులో 30 లేదా 31 మంది సభ్యులకు చోటు కల్పించే అవకాశం వుంది. వీరిలో నలుగురు ఉన్నతాధికారులు కూడా ఉంటారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి డిమాండ్ విపరీతంగా వుండడం, మరోవైపు పరిమిత సంఖ్యలో నియమించే వెసలుబాటుతో సీఎం జగన్ సతమతమవుతున్నారని సమాచారం.
కేవలం ఏపీ వారే కాకుండా, ఇతర రాష్ట్రాల వ్యక్తులను కూడా చోటు కల్పించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర తదితర మొత్తం 11 రాష్ట్రాల సీఎంలు తమ వారికి అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల సీఎంల ఒత్తిడి పని చేస్తే తమకు అవకాశం దక్కదని ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు ఆందోళనకు గురవుతున్నారు.