విజయవాడ వెస్ట్ విషయంలో జనసేన రాజకీయం రోడ్డున పడింది! అయినప్పటికీ అక్కడి ఆశావహులందరినీ తలదన్ని చంద్రబాబుకు అతి సన్నిహితుడైన సీఎం రమేష్ కు బీజేపీ టికెట్ దక్కింది! ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసినా, సత్యకుమార్ పోటీ చేసినా.. చంద్రబాబు సన్నిహితులే, చివరకు సత్యకుమార్ కు టికెట్ దక్కింది! అనకాపల్లి ఎంపీ గా చంద్రబాబుకు మరో సన్నిహితుడు సీఎం రమేష్ కు బీజేపీ టికెట్ దక్కింది. జమ్మలమడుగులో చంద్రబాబు భక్తుడు ఆదినారాయణ రెడ్డికి అవకాశం లభించింది బీజేపీ తరఫున!
ఇలా చెబుతూ పోతే.. కమలం చొక్కాలన్నింటికీ పచ్చ రంగే హైలెట్ అవుతోంది! అయితే.. ఎక్కడ చూసినా స్థానికత, లేదంటే టీడీపీ- జనసేనల ఆశావహులు ఉండటం, లేదా బీజేపీలోనే అసంతృప్తగళం ఉండటం.. ఇలాంటివే కనిపిస్తున్నాయి కమలం పార్టీ అభ్యర్థిత్వాల విషయంలో!
అనకాపల్లికి సీఎం రమేష్ కు ఏం సంబంధం? ధర్మవరానికి సత్యకుమార్ కు మరేం సంబంధం? ఎచ్చెర్లలో బీజేపీకి ఉన్న బలమేంటి? సుజనాచౌదరికి జనసేన క్యాడర్ సహకరిస్తుందా? అక్కడ నుంచి ఆశించిన బీజేపీ పాత వాళ్ల పరిస్థితి ఏమిటి? అక్కడ నుంచి ఆశించిన టీడీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు సన్నిహితుడని సుజనాచౌదరి గెలుపుకు పని చేస్తారా? బద్వేల్ లో డిపాజిట్ అయినా దక్కుతుందా? ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీలోనే టికెట్ విషయంలో రచ్చ రగులుతోంది! అరకు పోటీ కి అసలు బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? కొత్త గుర్తు ద్వారా పోయినంత మాత్రానా ఆదినారాయణ రెడ్డిని స్థానికులు పట్టించుకుంటారా? అనపర్తిలో బీజేపీకి అడ్రస్ ఉందా?
బీజేపీ తరఫున 10 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఎక్కడైనా ఒక్క చోటైనా మెరుపులాంటి క్యాండిడేట్ ను దించారనే ఫీలింగ్ కానీ, పాత వాడికి అవకాశం ఇచ్చారనే నమ్మకం కానీ, నియోజకవర్గంలో నలుగురికి తెలిసిన అభ్యర్థిని తెరపైకి తెచ్చారనే భావనలు కానీ ఎక్కడా కలగదు! బీజేపీ అంటే .. వ్యక్తుల కన్నా సిద్ధాంతాల పార్టీ అనే ఇమేజ్ ఉండేది! అయితే ఏపీ లో బీజేపీ వ్యవహారాన్ని చూస్తే మాత్రం.. దేశంలో రాజకీయంగా వర్ధిల్లుతున్న తరుణంలో కూడా కమలం పార్టీకి ఇదేం పతనావస్థ అనే ఆశ్చర్యం కలుగుతుంది. 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే.. ఒక్క చోట అయినా బీజేపీలో ఆశలు రేపగల అభ్యర్థి కనిపించడం లేదు! ఇదంతా చంద్రబాబు లీల అనుకోవాలో, కమలం పార్టీ గోల అనుకోవాలో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు