చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇచ్చుకున్నారు. ఇదే పార్టీకి చెందిన కొందరు నాయకులకు మాత్రం సాకులు చెప్పి, టీకెట్లు ఎగ్గొట్టారు. దీంతో కొంత మంది టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు కుటుంబంలో ఆయనతో పాటు లోకేశ్, నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు మోత్కుపల్లి భరత్ అలియాస్ గీతం భరత్కు సిట్లు ఖరారయ్యాయి.
విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ పట్టు పట్టినా చంద్రబాబు మాత్రం ఖాతరు చేయకపోవడం విశేషం. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కుదరడంతో ఆయన మరింత ఆనందించారు. అయితే విశాఖపట్నం సీటు విషయంలో చంద్రబాబు గట్టిగా ఉన్నారు. లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్కే టికెట్ను ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కింది. అయితే తమ వరకూ వచ్చే సరికి కుటుంబానికి ఒక సీటే అని మెలిక పెట్టడం ఏంటని పరిటాల సునీత, జేసీ ప్రభాకర్రెడ్డి తదితర నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సూత్రం అందరికీ ఎందుకు వర్తించడం లేదని వారంతా నిలదీస్తున్నారు.
ధర్మవరం సీటును పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఆయన పని చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించినట్టు తెలిసింది. ఇదంతా వరదాపురం సూరికి టికెట్ ఇచ్చేందుకే అని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. అధికారికంగా ధర్మవరం సీటు ఎవరికో తేలితే, పరిటాల వర్గం మాత్రం ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక జేసీ కుటుంబానిది కూడా చెప్పుకోలేని బాధ. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని జేసీ పవన్కు అడిగారు. కానీ ఆయనకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జేసీ దివాకర్రెడ్డి, ఆయన కుమారుడు పవన్ టీడీపీకి దూరంగా వుంటున్నారు. జేసీ దివాకర్రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తుంటారు. తమకైతే ఒక రూల్, ఇతరులకైతే మరొకటా? అని వారు నిలదీస్తున్నారు. కేవలం డబ్బు ప్రాతిపదికగా సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు జరుగుతోందని వారి ఆవేదన. తన కుటుంబం వరకూ వస్తే, చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యులకు మాత్రం టికెట్లు ఇచ్చుకోవడాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు