ప్రజలంటే బాబుకు చిన్న చూపు. ఎంతసేపూ తాను చెప్పిందే వినాలంటారు. అంతే తప్ప, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పరు. ఏం చెప్పినా జనం వింటారనే గుడ్డి నమ్మకం చంద్రబాబుది. అయితే అలాంటి వాటికి కాలం చెల్లిందని ఇంకా చంద్రబాబే గుర్తించలేకపోతున్నారు.
ఇప్పుడాయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అధికారికంగా ఆ కూటమి సర్టిఫికెట్ పొందారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదేపదే చెబుతున్నది ఏంటంటే... తమను ఆదరిస్తే ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేస్తుందని. ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే అని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, జగన్కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తన ఐదేళ్ల పాలనలో మంచి జరిగిందని భావిస్తేనే ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని జగన్ కోరుతున్నారు. తన పాలనను రెఫరెండంగా ఆయన తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే... ఆదరిస్తే ఎన్డీఏ కూటమి అభివృద్ధ చేసే బాధ్యత తీసుకుంటుందని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంటే 2014లో ఇవే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. 2014 నుంచి చంద్రబాబే సీఎంగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాది ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికొచ్చారు. ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు ఏపీకి చేసిన అభివృద్ధి ఏంటో ఎన్నికల ప్రచారంలో చెప్పి, ఓట్లు అడిగితే బాగుండేది. కానీ ఆ పని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. దీనికి కారణం...ఐదేళ్లలో తన సొంతానికి మాత్రమే చంద్రబాబు చేసుకున్నారు.
రాజధాని అమరావతిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడా వ్యాపారానికి జగన్ గండికొట్టారు. అమరావతి రాజధానిని ఎన్నికల ప్రచార అంశంగా చేసుకోలేని దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎంతసేపూ జగన్పై వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబును చూడొచ్చు. అందుకే గత ఎన్డీఏ హయాంలో అభివృద్ధి గురించి మాత్రం అడగ్గొద్దని చంద్రబాబు తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు