వైసీపీ మేనిఫెస్టోపై విస్తృత చర్చ జరుగుతోంది. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 22న మేనిఫెస్టోపై పార్టీ ముఖ్య నాయకులతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు లోపు వైసీపీ మేనిఫెస్టో విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా మంగళవారం 2 వేల మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాల్ని జగన్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన యాక్టివిస్టు మాట్లాడుతూ... జగనన్నా రుణమాఫీ ప్రకటిస్తే, 175కు 175 అసెంబ్లీ సీట్లు మళ్లీ మనకే అని హర్షధ్వానాల మధ్య చెప్పారు. రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చాలనే సోషల్ మీడియా యాక్టివిస్టు అభిప్రాయంపై జగన్ నవ్వుతూ వినడమే తప్ప, స్పందించలేదు.
కనీసం లక్ష రూపాయల రైతు రుణమాఫీని ప్రకటించాలని జగన్పై వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు రైతుల రుణమాఫీ చేస్తానని ప్రకటించి, చివరికి మోసగించారు. అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా చేయలేదు. అందుకే బాబుపై జనంలో విశ్వసనీయత లేదు. ఇదే జగన్ విషయానికి వస్తే... చెప్పాడంటే, చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో వుంది.
ఆ నమ్మకాన్ని కీలకమైన ఈ ఎన్నికల్లో రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే బలమైన కోరిక ప్రతి అధికార పార్టీ నేతలో వుంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకవేళ జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం ...వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు