ఇద్దరు శ్రీనులలో ఎవరికి ఓటమి ఫేట్?

ఇద్దరూ శ్రీనులే. ఇద్దరూ రాజకీయంగా ఓటమి ఎరుగని వారే. ఆ ఇద్దరూ గెలుపుని వెతుక్కుంటూ భీమిలీ బరిలోకి దిగారు. వారిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మరో మాజీ మంత్రి అవంతి…

ఇద్దరూ శ్రీనులే. ఇద్దరూ రాజకీయంగా ఓటమి ఎరుగని వారే. ఆ ఇద్దరూ గెలుపుని వెతుక్కుంటూ భీమిలీ బరిలోకి దిగారు. వారిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఇద్దరి శ్రీనులకు చాలా పోలికలు ఉన్నాయి.

ఇద్దరూ ఎంపీలుగా అనకాపల్లి నుంచే నెగ్గారు. ఎమ్మెల్యేలుగా భీమిలీ నుంచి పనిచేశారు. ఇద్దరికీ భీమిలీ అంటే మోజు ఎక్కువ. ఇద్దరూ ఎన్నడూ ఓటమి పాలు కాలేదు. ఇప్పుడు భీమిలీలో గెలుపు ఎవరితో తెలియదు కానీ ఒకరికి మాత్రం కచ్చితంగా ఓటమి అందడం ఖాయం.

ఓటమి వీరుడు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం రెండు పార్టీలలో తీవ్రమైన చర్చగా ఉంది. గంటా బిగ్ షాట్ గా బరిలోకి దిగిపోయారు. ఆయన జనంలోకి వెళ్లడం కంటే ఎక్కువగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్న నాయకులను సైకిలెక్కించే పనిలోనే బిజీగా ఉన్నారు.

ఆ జోరుని వైసీపీ చేయలేకపోతోంది. అక్కడే తేడా కొడుతోంది. అయితే నాయకులు వచ్చినంత మాత్రాన ప్రజలు కూడా వారి వెంట వస్తారా. వారు ఓటేస్తారా అంటే అది ఎన్నికల్లో తేలుతుంది. భీమునిపట్నంలో గ్రామాలు ఎక్కువ. ఆ గ్రామాలలో వైసీపీ పథ‌కాలు బాగా వెళ్లాయి.

అదే ఇపుడు టీడీపీని కలవరపెడుతోంది. అంతే కాదు మహిళా ఓటింగ్ ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆలాగే కాపులు తరువాత బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి పూర్తి స్థాయిలో టర్న్ అయితే టీడీపీకి ఇబ్బంది అని అంటున్నారు.

ప్రతీ ఎన్నిక ఒక భిన్నమైనది గానే ఉంటుంది. 2014 మాదిరిగా ఈసారి గెలిచేయవచ్చు అనుకుంటే టీడీపీకి కుదరదు అని అంటున్నారు. టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్తులు చాప కింద నీరులా ఉన్నాయి. పైకి నాయకులు కలసినంత మాత్రాన వారు కలవాలని లేదు.

వైసీపీలో చూసుకుంటే అవంతి శ్రీనివాసరావు జనంలో ఉంటారని పేరు ఉంది. అయితే ఆయన ఇంకా దూకుడుగా రాజకీయం చేయాల్సి ఉంది. గంటాను తట్టుకుని ప్రతి వ్యూహాలను రూపొందించడంలో వైసీపీ తడబడుతోంది. ఎంతలా అంటే తమ పార్టీలో నిన్నటిదాకా ఉన్న నేతలు సైకిలెక్కేస్తున్నారు అన్న విషయం తెలియనంతగా.

ఇలా వైసీపీ- టీడీపీల మధ్య పోరు అయితే ఆసక్తికరంగానే ఉంది. ఈసారి ఇద్దరు శ్రీనుల జాతకం భీమిలీ నిర్ణయిస్తుంది. ఒక శ్రీను గెలిచి గెలుపే తన రాచబాట అని చెప్పుకుంటే అదే భీమిలీ మరో శ్రీనుకు ఓటమి ఫేట్ నిర్ణయిస్తుంది. దాంతో ఇద్దరు శ్రీనులకు భీమిలీ రాజకీయంగా ఎప్పటికీ గుర్తుండిపోయే తీర్పు ఇస్తుంది అని అంటున్నారు.