ప్రతిపక్షాలకు ఎన్నికల ఆయుధం లేకుండా కడప కోర్టు చేసింది. వివేకా హత్య కేసును ఎన్నికల ఆయుధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ అవినాష్పై ప్రతిపక్షాల నేతలు ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు వివేకా హత్య కేసే ప్రధాన ఎజెండాగా మారింది. రాజన్న బిడ్డగా తాను పోటీ చేస్తున్నానని, మరోవైపు ఆయన తమ్ముడు వివేకాను చంపిన హంతకుడు ప్రత్యర్థిగా ఉన్నాడంటూ షర్మిల, సునీత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
వీళ్లకు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, లోకేశ్, దగ్గుబాటి పురందేశ్వరి తదితర నేతలు జత కలిశారు. వివేకా హత్య కేసును జగన్కు ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వీళ్లంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల, అలాగే తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సునీత కేవలం హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు.
ఈ విషయమై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో కడప మేయర్ కె.సురేష్బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో షర్మిల, సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, దగ్గుబాటి పురందేశ్వరి, బీటెక్ రవి, పవన్కల్యాణ్లను ప్రతివాదులుగా చేర్చారు. విచారించిన కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతిపక్షాలకు గట్టి షాక్ తగిలినట్టైంది. వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని ఓట్లు రాల్చుకుందామనే వారి కుట్రలకు కడప కోర్టు అడ్డుకట్ట వేసిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించి మాట్లాడకుండా వుంటారా? లేక యధాప్రకారం షర్మిల, సునీత నోటి దురుసు ప్రదర్శిస్తారా? అనేది చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు