కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి అతి ఓ రేంజ్లో వుంది. "ఏందిరా నాయనా మాధవీరెడ్డి అతిపూరి వ్యవహారం. ఈమెను ఎట్లా భరించడం? కడపలో అంటే సరే, వేరే జిల్లాకు వెళ్లినా ఓవరాక్షనేనా" అని కడప టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరంలో మాధవీరెడ్డి వ్యవహారం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈమె తీరును కడపలో టీడీపీ శ్రేణులే తప్పు పడుతున్నాయి. తన పరిధికాని ప్రాంతానికి వెళ్లి, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం , అది కాస్త వివాదానికి దారి తీయడంపై కడపలో సొంత పార్టీ శ్రేణులే తప్పు పడుతున్నాయి.
"మాధవీరెడ్డి యాడికి పోయినా ఏదో ఒక గొడవ సృష్టించాల్సిందేనా? కడపలోనే ఈమెతో ఏగలేక చస్తనాం. చాలదన్నట్టు గన్నవరం పోయి చిచ్చు పెట్టింది మహాతల్లి. ఈమెను భరించడం ఎట్లరా తండ్రి. మా నెత్తిన గుదిబండను తీసుకొచ్చి పెట్టినావే సంద్రబాబు" అంటూ కడప టీడీపీ నేతలు తిట్టిపోస్తున్నారు. రాష్ట్రస్థాయిలో మాధవీరెడ్డి చర్చనీయాంశం కావడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.
ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి తన కుమార్తెతో కలిసి కారులో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కళ్లలో వైసీపీ జెండాలు, సిద్ధం ప్లెక్సీలు, అలాగే అధికార పార్టీ రంగులు పడ్డాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వీటిని తొలగించలేదని మాధవీకి కోపం వచ్చింది. వెంటనే వాటిని ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేసి ఎన్నికల సంఘానికి ఆమె ఫిర్యాదు చేశారు. దీన్ని గమనించిన వంశీ అనుచరులు ఆమెను అడ్డుకున్నారు. కారులో ఉన్న మాధవీరెడ్డి, ఆమె కుమార్తె భయాందోళనకు గురై 100కు ఫోన్ చేశారు.
పోలీసులు వచ్చి స్టేషన్కు రావాలని ఆమెను కోరారు. అనంతరం అక్కడికి గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వెళ్లారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ శ్రేణులు మోహరించాయి. యుద్ధ వాతావరణం నెలకుంది. పరస్పరం దూషించుకున్నారు. కొట్టుకునే పరిస్థితి. ఎలాగోలా పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం మాధవీరెడ్డి చేసిన పనిని తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే స్థానికంగా గన్నవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సీ విజిల్ యాప్కు ఫిర్యాదు చేయొచ్చు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. స్థానిక టీడీపీ నాయకులెవరికీ చేతకాక, ఆ పని తాను చేస్తున్నాననే బిల్డప్ మాధవీరెడ్డిది.
కడపలో కూడా ఈమె తీరు వివాదాస్పదంగా వుంది. ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం, తిరిగి వాళ్లు ఏదైనా అంటే... మహిళ అనే ఇంగితం కూడా తిడుతున్నారంటూ నానా యాగీ చేస్తున్నారు. తన భర్త ఆర్.శ్రీనివాస్రెడ్డికి ఏమీ చేతకాలేదని, తాను చేసి చూపిస్తాననే రీతిలో మాధవీరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కడప టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మాధవీరెడ్డి అతి నచ్చకపోవడం వల్లే టీడీపీ సీనియర్ నాయకులు అలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్బాబు తదితరులంతా దూరంగా ఉన్నారు.
కడపలో టీడీపీ బాధ్యతలు తన చేతికి వచ్చిన తర్వాతే, ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు మాధవీరెడ్డి ఓవరాక్షన్ చేస్తోందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మాధవీ ఏ ఊరికి పోయినా, అక్కడ కొంపకు మూడు వాకిళ్లు పెట్టకుండా తిరిగి రారని కడప టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరానికి వెళ్లి తన పనేదో చూసుకోకుండా, అనవసరంగా అక్కడి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన పనేంటని వారు నిలదీస్తున్నారు. ఈమెను భరించలేం బాబోయ్ అని కడప టీడీపీ నాయకులు అంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు