తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ గెలిచి తీరాలని ఇటీవల అక్కడ పర్యటించిన చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ సత్యవేడు వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సత్యవేడులో టీడీపీ గెలవడం దేవుడెరుగు, ముందు కుప్పంలో గెలువు చూద్దామని చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ వద్దనుకున్న వ్యక్తిని, సత్యవేడులో టీడీపీ నిలబెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీకి అభ్యర్థులెవరూ లేకపోవడంతో తాము వద్దనుకున్నోళ్లకు టికెట్ ఇచ్చుకోవాల్సిన దయనీయ స్థితి చంద్రబాబుది అని ఆయన తప్పు పట్టారు. రాత్రికి రాత్రి పార్టీ మారిన నాయకుల్ని ఎవరు ఆదరిస్తారని ఆయన ప్రశ్నించారు.
తనపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఓట్లు పోతాయని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. 2014లో చంద్రబాబునాయుడు 100 పేజీల్లో 600 హామీలు ఇచ్చారని విమర్శించారు. వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
హామీలను నెరవేర్చడంలో ఇచ్చిన మాటపై ఎవరు నిలబడతారో ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. ఇంత కాలం వైసీపీతో సేవలు చేయించుకుని, ఇప్పుడు టీడీపీలోకి వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థి కోనేటి ఆదిమూలానికి ఓటమి తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు