Advertisement

Advertisement


Home > Politics - Andhra

దూసుకెళుతున్న వంగా గీత‌

దూసుకెళుతున్న వంగా గీత‌

కాకినాడ జిల్లా పిఠాపురంపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి ప‌డింది. ఎందుకంటే ఇక్క‌డి నుంచి టాలీవుడ్ అగ్ర‌హీరో, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేయ‌డ‌మే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఆయ‌న‌కు న‌మ్మ‌క‌మైన గెలుపు సీటు కావాలి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అత్య‌ధికంగా పిఠాపురంలో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయ‌ని ప‌వ‌న్ గుర్తించారు.

సుమారు 90 వేల కాపుల ఓట్లు ఉన్నాయ‌ని ఆయ‌న గ్ర‌హించారు. ఇంత‌కంటే గెలుపు సీటు లేద‌ని ఆయ‌నలో ధీమా క‌నిపించింది. దీంతో ఆయ‌న పిఠాపురంలో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్‌పై కాకినాడ ఎంపీ వంగా గీత‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బ‌రిలో నిలిపారు. ప‌వ‌న్‌ను ఓడించ‌డం వైసీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. పిఠాపురం ఒక్క విష‌యంలో వైసీపీకి టీడీపీ లోలోప‌ల ప‌రోక్షంగా స‌హ‌కారం అందిస్తోంది.

టీడీపీ కార్య‌క‌ర్త‌లెవ‌రూ జ‌న‌సేన వెంట ఇంత వ‌ర‌కూ తిర‌గ‌లేదు. మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత ప్ర‌చారంలో శ‌ర వేగంతో దూసుకెళుతున్నారు. పిఠాపురం సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు కూడా సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం త‌ర్వాత టికెట్ ఇవ్వ‌లేద‌నే అసంతృప్తి వీడి వంగా గీత గెలుపు కోసం ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పిఠాపురంలో గీత‌ను గెలిపించే బాధ్య‌త‌ను దొర‌బాబుపై సీఎం పెట్టారు. దీంతో ఆయ‌న కూడా ఉత్సాహంగా బ‌రిలో దిగారు.

వంగా గీత కూడా ప‌వ‌న్ సామాజిక వ‌ర్గ‌మే. స్థానికురాలు, విద్యావంతురాలైన వంగా గీత ఓట‌ర్ల‌ను నేరుగా క‌లిసి అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో పాటు కాపు ప్ర‌ముఖులు పిఠాపురంలో వాలిపోయారు. త‌మ‌కున్న బంధుత్వాలు, స్నేహాల‌ను ఈ ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకుంటున్నారు. స్థానికురాలైన వంగా గీత‌ను గెలిపించుకుంటే , ఏదైనా చేయించుకోవ‌చ్చ‌ని చైత‌న్య‌ప‌రుస్తున్నారు.

అలాగే వారి అవ‌స‌రాల‌ను తెలుసుకుని, అప్ప‌టిక‌ప్పుడు తీర్చుతున్నారు. ప‌వ‌న్‌ను గెలిపిస్తే, అందుబాటులో వుండ‌ర‌ని, క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌ద‌ని, నీతులు చెప్ప‌డం త‌ప్ప‌, చేత‌ల్లో ఏమీ చూప‌ర‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ప‌వ‌న్‌కు ఓటు వేస్తే, చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డం త‌ప్ప కాపుల‌కు ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు శూన్య‌మ‌ని చెబుతున్నారు.

క్షేత్ర‌స్థాయిలో వైసీపీ టీమ్ ప‌నుల్ని చ‌క్క బెడుతుండ‌గా, ప్ర‌చారంలో వంగా గీత నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌తి గ‌డ‌పా ఆమె తొక్కుతున్నారు. కాపు ఆడ‌బిడ్డ అయిన త‌న‌ను ఆద‌రించాల‌నే ఆమె విజ్ఞ‌ప్తికి సానుకూల స్పంద‌న క‌నిపిస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. వైసీపీ నేత‌లు హ‌డావుడి త‌గ్గించి, చాప‌కింద నీరులా పిఠాపురంలో ప‌వ‌న్‌ను ఓడించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతున్నార‌ని స‌మాచారం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?