వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన సొంత జిల్లాలో ఒక చోట మినహా, మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. కానీ కమలాపురం నియోజక వర్గంలో మాత్రం అభ్యర్థిని మార్చాలని జనం కోరుకుంటున్నారు. ఇక్కడి నుంచి సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మూడోసారి ఆయన హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
కానీ ఆయనపై అక్కడ అసంతృప్తి బాగా వుంది. చంద్రబాబునాయుడు తెలివిగా ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చారు. టీడీపీ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డిపై తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, ఆయన కుమారుడు చైతన్యరెడ్డిని చంద్రబాబు బరిలో దింపారు. టీడీపీ నష్ట నివారణకు ఈ మార్పు కొంత వరకు దోహదం చేస్తుంది.
టీడీపీ మాదిరిగానే వైసీపీ కూడా యువ నాయకుడిని బరిలో దింపి వుంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి తనయుడు, సీకేదిన్నె జెడ్పీటీసీ సభ్యుడు నరేన్ రామాంజనేయరెడ్డికి టికెట్ ఇచ్చి వుంటే, ఇద్దరు యువనేతల మధ్య పోటీ రసవత్తరంగా వుండేదని అంటున్నారు. రవీంద్రనాథ్రెడ్డిపై నెగెటివిటీ పక్కకు పోయి వుండేదని, వైసీపీ శ్రేణులు కూడా హుషారుగా పని చేసేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రవీంద్రనాథ్రెడ్డి కుమారుడు నరేన్ చాలా యాక్టీవ్గా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రత్యర్థి యువ నాయకుడు అయినప్పుడు తన కుమారుడిని రంగంలోకి దింపే దిశగా రవీంద్రనాథ్రెడ్డి ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు తమ కుమారులు, కుమార్తెలను బరిలో దింపడాన్ని చూసైనా, కాస్త పదవీ వ్యామోహాన్ని వదిలి సానుకూలంగా రవీంద్రనాథ్రెడ్డి ఆలోచించాలి. వైఎస్ జగన్ శ్రేయోభిలాషి అయితే తన కుమారుడిని రవీంద్రనాథ్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేది ప్రజాభిప్రాయం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు