కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టెన్త్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. టెన్త్తో పాటు ఇంటర్ సప్టిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.
శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ పరీక్షల నిర్వహణకు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చామన్నారు. ప్రశ్న పత్రాలను కూడా తగ్గించామన్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని, తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ టెన్త్ పరీక్షల రద్దు వైపే మొగ్గు చూపారన్నారు. అలాగే ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా కొన్ని నెలలుగా టెన్త్ పరీక్షలపై నెలకున్న ఉత్కంఠకు ఏపీ సర్కార్ ఎట్టకేలకు తెరదించింది.