తెలుగుదేశం నేత మాన్సాస్ ట్రస్ట్ ధర్మకర్త అశోక్ గజపతి రాజుపై ఏపీ మంత్రులు ధ్వజమెత్తారు. దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణలు స్పందిస్తూ… అశోక్ గజపతి రాజు అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. రామతీర్థం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో అశోక్ గజపతి రాజు వ్యవహరించిన వైనాన్ని మంత్రులు తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందంటూ అశోక్ గజపతి రాజు ఆలయం వద్ద హల్చల్ చేశారు. శంకుస్థాపన పలకాన్ని తోసేసి.. నానా రచ్చ చేశారు. ఇక అశోక్ కు అవమానం జరిగిందంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ఈవ్యవహారాన్ని రచ్చ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది.
అయితే తాము చేసిన తప్పేంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. రామతీర్థం ఆలయాన్ని ప్రభుత్వ సొమ్ములతో అభివృద్ధి చేయడం తప్పా అన్నారు. మూడు కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. ఆలయానికి ధర్మకర్తగా ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. భూములను అనుభవిస్తూ.. ఆలయ అభివృద్ధికి ఎందుకు నిధులు వెచ్చించలేదన్నారు.
తాము అశోక్ గజపతి రాజుకు ఆలయ ధర్మకర్తగా ఆహ్వానం పంపామన్నారు. ఆహ్వానంతో గుడి పూజారులు, అధికారులు వెళితే వారిని తిట్టి పంపించారన్నారు. అది చాలక.. శంకుస్థాపన ప్రాంతానికి వచ్చి ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. అశోక్ గజపతి తీరుపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉన్నా.. తాము సంయమనం పాటిస్తున్నట్టుగా మంత్రి బొత్స అన్నారు. ఇప్పటికైనా అశోక్ అహంకారాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు.