తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం దీక్షకు దిగనున్నారు. జిల్లాల పునర్వ్యస్థీకరణపై కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తానని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హామీలను నెరవేర్చడంపై ఆయన దృష్టి పెట్టారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత జిల్లాల పునర్వ్యస్థీకరణపై ఆయన దృష్టి సారించారు.13 జిల్లాలకు మరో 13 కొత్త జిల్లాలు వచ్చి చేరాయి. పుట్టపర్తి సాయిబాబా పేరుతో కొత్తగా జిల్లాను ప్రకటించారు. ఈ జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని కాదని, పుట్టపర్తిని ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఎమ్మెల్యే బాలయ్య నిరసన దీక్షకు దిగనున్నారు. హిందూపురంలో శుక్రవారం అఖిలపక్షం నేతలతో ఆయన సమావేశమవుతారు. అలాగే హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అనంతరం ఆయన దీక్షలో కూర్చోనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయన దీక్షలో కూర్చోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.