ఆ కురువృద్ధుడు గెలిచి తీరాలి

ప్రస్తుత తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లో అత్యంత సీనియర్, అత్యంత అనుభవజ్ఞుడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి వరించగల నాయకుడు జానారెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న కేసీఆర్…

ప్రస్తుత తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లో అత్యంత సీనియర్, అత్యంత అనుభవజ్ఞుడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి వరించగల నాయకుడు జానారెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న కేసీఆర్ భాషలో చెప్పాలంటే గౌరవనీయులు, పెద్దలు జానా రెడ్డి తప్పక గెలిచి తీరాల్సిన అవసరం ఉంది.

అదేంటి ? గెలిచి తీరాల్సిందేనని మనం అంటే సరిపోయిందా ? ఎన్నికల్లో గెలవడం అనేది ఆయన సొంతంగా చేసే  పని కాదు కదా. అది ప్రజలు అంటే లక్షలాదిమంది ఓటర్లు చేసే పని. పాల ముంచినా, నీట ముంచినా …అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళేం చేస్తారో మనకు తెలియదు.

కానీ జానారెడ్డి గెలిచి తీరాల్సిందే. ఆయన గెలవాలని, టీఆర్‌ఎస్ , బీజేపీ ఓడిపోవాలని మనమేమీ ప్రత్యేకంగా కోరుకోవడంలేదు. జానారెడ్డి తప్పనిసరిగా గెలుస్తాడని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లి ఎస్ …ఆయన గెలిచితీరాల్సిందే అంటున్నాం. ఎందుకు గెలిచి తీరాలి అనే ప్రశ్న వస్తోంది. 

కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించాలని డిసైడ్ చేసినప్పుడు ఆయన ఓ హై కమాండ్ కు ఓ షరతు పెట్టాడు. గుర్తుండే ఉంటుంది. సాగర్ ఉప ఎన్నిక ముగిసేంతవరకు టీపీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించకూడదు. టీపీసీసీ అధ్యక్ష పదవికోసం నాయకులు కొట్టుకుంటే ఆ ప్రభావం తన గెలుపు మీద పడుతుందని, కాబట్టి ఆ పని చేయొద్దని హైకమాండ్ ను కోరాడు జానారెడ్డి.

కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటే ఆ ప్రభావంతో తానూ ఓడిపోయే అవకాశం ఉందని జానా చెప్పాడన్న మాట. పెద్దాయన ఇలా విజ్ఞప్తి చేయగానే ఆయన్ని గౌరవించి అధిష్టానం టీపీసీసీ అధ్యక్ష పదవిని వాయిదా వేసింది. అంటే అధిష్టానం తన మాట నిలబెట్టుకుందన్నమాట. 

మరి ఇప్పుడు జానా రెడ్డి కూడా తన మాట నిలబెట్టుకోవాలి కదా. అంటే ఉప ఎన్నికలో గెలిచి తీరాలి. అంటే ఇది ఆయనకు వ్యక్తిగతంగా, పార్టీపరంగా పరువు సమస్య. అందులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ వయసులోనూ, అనుభవంలోనూ జానారెడ్డి ముందు పిల్ల కాకి. ఈ పిల్ల కాకికి ఇదే మొదటి ఎన్నిక. మరి జానా రెడ్డి అతడు అనేక యుద్ధముల ఆరితేరియు అన్నట్లుగా ఉన్నాడు. కాబట్టి ఏవిధంగా చూసినా జానారెడ్డి గెలిచి తీరాల్సిందే. 

వరుస ఓటములతో సతమమౌతున్న కాంగ్రెస్ కు… నాగార్జున సాగర్ ఉపఎన్నిక సవాలుగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంతకుముందు దుబ్బాక,గ్రేటర్ ఎన్నికలతో మట్టి కరిచింది. అన్ని ఎన్నికల్లో ఓటములతో కాంగ్రెస్‌ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది. జీహెచ్ఎంసి ఎన్నికలో కేవలం రెండంటే రెండే స్థానాల్లో గెలిచింది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది.

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ లో గెలవడం కాంగ్రెస్ కు అనివార్యమైన పరిస్థితి. గతంలో దుబ్బాక ఉపఎన్నికలో అందరూ నాయకులు కలిసికట్టుగా పని చేశారు. విభేదాలు పక్కన పెట్టీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చమటోడ్చారు.  రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ దగ్గరుండి మానిటరింగ్ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. కానీ నాగార్జున సాగర్ కు వచ్చేసరికి సీన్ అంతా మారింది.  

ఈ ఎన్నికలో జానారెడ్డి బరిలోకి దిగాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్లు ఎవరూ ప్రచారం చేయడం లేదు. పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఉపఎన్నికలో సీనియర్ నాయకులుగా చెప్పుకునే వారు జానారెడ్డి గెలుపు కోసం పనిచేయాలి. కానీ వీరంతా ఆంటీ ముట్టనట్లు గా వ్యవహరిస్తున్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాబట్టి ప్రచారం చేయక తప్పలేదు. గెలిచే హోప్ కూడా లేని దుబ్బాక లో సీరియస్ గా దృష్టి పెట్టిన ఢిల్లీ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు .. ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్న సాగర్ ను మాత్రం పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జానారెడ్డి ఇప్పటి వరకు రెండు మూడు సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఆయా మండలాల్లో గ్రామాలకు వెళ్లారు. ముఖ్యుల్ని పిలిచి మాట్లాడారు. కానీ ఎన్నికల బూత్ కు వెళ్ళే వరకు ఓటర్లను జానారెడ్డి ఇమేజ్ ఏమేరకు ప్రభావితం చేస్తుందనేది  పెద్ద ప్రశ్న. 

ఎవరు ఎన్ని రకాల ప్రచారం నిర్వహించినా .. పోల్ మేనేజ్ మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ.. ఆ విషయంలో…. కాంగ్రెస్‌ సీనియర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి 7 సార్లు గెలిచారు. ఇక్కడ ఆయనకు గట్టి పట్టుంది. గ్రామాల్లోనూ అనేక మందిని పేరు పెట్టి పిలిచే నాయకుడు. ఆయనకు ఉన్న ఈ ఇమేజే గెలుపు కు దోహద పడుతుందనే ధీమా హస్తం నేతల్లో ఉంది. మరి ఆ ఇమేజ్ జానారెడ్డిని గెలిపిస్తుందా ?