ఒకవైపు ఇండియా లాక్ డౌన్ ను మరో నెల పాటు కొనసాగిస్తే మేలనే సూచనలు.. మరోవైపు ఇండియాలో కరోనా అంత భయానకంగా విస్తరించడం లేదనే విశ్లేషణలు.. అయితే రోజు రోజుకూ పెరుగుతున్న నంబర్లు.. ఇంకో వైపు లాక్ డౌన్ ను పాటిస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది లేకపోతే మరో ఉంటుందనే లెక్కలు.. వీటన్నింటికీ తోడు.. ఇండియాలో కరోనా మందగమనంలోనే ఉందని కేంద్రం విశ్వాసంగా చెబుతూ ఉండటం. మిగతా దేశాలతో పోల్చి చూసినా కరోనా వ్యాప్తి శాతం కానీ, కరోనా వల్ల మరణాల రేటు కానీ తక్కువగానే ఉందని కేంద్రం అధికారంగా చేస్తున్న ప్రకటనలు.. స్థూలంగా అంతా గందరగోళం!
ఇప్పుడు లాక్ డౌన్ అయితే అమలవుతూ ఉంది, కానీ చాలా చోట్ల జనాలు 11 వరకూ ఇష్టానుసారం తిరుగుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా తిరుగుతున్నారు. లాక్ డౌన్ పాటించే వాళ్లు మాత్రం పాటిస్తూ ఉన్నారు. అయినా నంబర్లు పెరుగుతున్నాయి, అయితే స్వల్పంగానే! ఎంత లోతుగా ఆలోచిస్తే అంత గందరగోళంగా, ఏ వైపు నుంచి ఆలోచిస్తే ఆ రకమైన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ వ్యవహారంలో!
అవన్నీ అలా ఉంటే.. జాతీయ మీడియా మాత్రం ఒక విషయాన్ని చెబుతోంది, మే 3 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండవచ్చు అని ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. కరోనా ప్రభావం గురించి కేంద్రం ఒక అంచనాకు వచ్చిందని, ఆ మేరకు దశల వారీగా లాక్ డౌన్ ను ఉపసంహరించనుందని టాక్ వినిపిస్తూ ఉంది.
అయితే లాక్ డౌన్ ఫస్ట్ ఫేజ్ లోనూ ఇలానే చెప్పారు. దశలవారీగా ఎత్తేసే ప్రకటనను మోడీ చేస్తారని వార్తలు వచ్చాయి, అయితే పొడిగింపు ప్రకటన చేశారు. బహుశా మే 3 తర్వాత కూడా మరో మూడు వారాలని మోడీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కరోనా ప్రభావం గురించి అత్యున్నత స్థాయి అంచనాలు.. ఇండియా భయాందోళనలకు గురి కానవసరం లేదని చెబుతున్నాయని, ఏప్రిల్ 29 వరకూ కేసుల సంఖ్య చాలా పెరిగినా, ఆ తర్వాత కచ్చితంగా తగ్గుముఖం పడతాయని వారు చెబుతున్నారట!
అందుకు సంబంధించిన గ్రాఫ్ పై చిత్రంలో ఉంది. ఏప్రిల్ 29 దేశంలో కరోనా కేసులకు పీక్ స్టేజి అని, ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని, మే రెండో వారానికి కొత్త కరోనా కేసులు ఉండవని ఆ గ్రాఫ్ చెబుతూ ఉంది! ఏప్రిల్ 29 తర్వాత గ్రాఫ్ కింది వైపుకు చూస్తే..మే 3 నుంచి లాక్ డౌన్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పవచ్చు. మరి ఏప్రిల్ 30 వ తేదీ నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని బట్టి.. దేశంలో లాక్ డౌన్ ను కొనసాగిస్తారా? మినహాయిస్తారా అనే అంశంపై ఒక అంచనాకు రావొచ్చేమో!